కంటోన్మెంట్, ఏప్రిల్ 28 : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రక్షణశాఖ సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారానికి బీఆర్కే భవన్లో మంత్రి కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్(119) పరిధిలో వరద నీటి కాలువ ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరు చేయాలని కోరారు. న్యూ బోయిన్పల్లిలోని సెంటర్ పాయింట్ బ్రిడ్జి నుంచి ఆర్ఆర్ నగర్ టూల్స్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర వర్షం నీటి కాలువ నిర్మాణం చేపడితే దాదాపుగా 12 కాలనీలు ముంపునకు గురికాకుండా ఉంటాయని, దీనికి సుమారు రూ.14కోట్ల వ్యయం అవుతుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వరద కాలువ నిర్మాణానికి చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గం బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని ఆర్ఆర్ నగర్ నుంచి వరంగల్ రైస్ మిల్ వరకు వరద నీటి కాలువ నిర్మాణానికి రూ.6కోట్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం పట్టించుకోకున్నా కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో వరదలు వచ్చిన సమయంలోనూ కంటోన్మెంట్ ప్రాంతానికి కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుందని గుర్తు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటిని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, త్వరలోనే ఎస్ఎన్డీపీ ద్వారా నిధులు కేటాయించి వరద కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న మర్రి రాజశేఖర్రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.