Jalamandali | సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రోజురోజుకు పెరుగుతున్న తాగునీటి డిమాండ్ను అధిగమించేందుకు జలమండలి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. మండుతున్న ఎండలు ఒకవైపు.. అడుగంటి భూగర్భ జలాలతో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అరకొర నీటి సరఫరాతో బస్తీ వాసులు డ్రమ్ముల్లో నీటిని నింపుకుంటూ, మరికొందరూ వాటర్ ట్యాంకర్ల కోసం అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్కారిడార్లో అపార్ట్మెంట్ వాసులు, వాణిజ్య వ్యాపారస్తులంతా జలమండలి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. సంస్థ పరిధిలో రోజూ 6500 నుంచి 7000 వరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతున్నాయంటే డిమాండ్ ఏ మేరకు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్స్, ట్యాంకర్లను అదనంగా సమకూర్చుతున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ట్యాంకర్ బుక్ చేస్తే మూడు రోజుల పాటు నిరీక్షణ తప్పడం లేదు. ఈ క్రమంలోనే నగరానికి ఐదు వనరుల నుంచి రోజూ 560 ఎంజీడీల మేర నీటిని అందిస్తుండగా..సింగూరు, మంజీరా మినహా జంట జలాశయాలు, ఎల్లంపల్లి, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి నిల్వలు ఆందోళనకరంగా మారాయి.
ఈ క్రమంలోనే అత్యవసర పంపింగ్ ద్వారా నగరానికి తరలించి సరఫరా చేయనున్నారు. వచ్చే రెండు నెలల పాటు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ పరిధిలో డైరెక్టర్లు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని, వేసవి ముగిసే వరకు అందరికీ సెలవులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా 12 గంటల్లోపు వాటర్ ట్యాంకర్ నీటి సరఫరా, అత్యవసర పంపింగ్ అధికారులకు సవాల్గా మారుతున్నది.