గౌడవెల్లి పాఠశాలలో ఇంకుడు గుంతలతో
లక్షల లీటర్ల నీటి పరిరక్షణ
విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యం ..
జయసూర్య ఫౌండేషన్ సహకారంతో మోడల్ ప్రాజెక్టు
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 18 : జలమే జీవం..జలం లేకపోతే జీవం లేదు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. నీటి పరిరక్షణ అవసరాన్ని భావి పౌరులైన విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోడల్ నీటి సంరక్షణ ప్రాజెక్టును జయసూర్య ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో వర్షాధార ప్రాజెక్టు డైరెక్టర్ కల్పనా రమేశ్ చేపట్టారు.
21 లక్షల లీటర్ల నీరు ఆదా…
పాఠశాల భవనం పై కప్పు నుంచే వచ్చే వర్షం నీటి నుంచి ఏడాదికి 9 లక్షల లీటర్లు, మిషన్ భగీరథ నీటి ట్యాంకు నుంచి వృథాగా పోయే నీటి నుంచి 12 లక్షల లీటర్ల నీటిని ఆదా చేసేలా రెండు ఇంకుడు గుంతలను నిర్మించారు. 11 ఫీట్ల పొడవు, 5 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల లోతు ఒక ఇంకుడు గుంత , 11 ఫీట్ల పొడవు, 6.5 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల లోతుతో మరో ఇంకుడు గుంతను నిర్మించారు. ఈ ఇంకుడు గుంతల్లోకి పైపులైన్ ద్వారా భవనం పై కప్పు నుంచి వచ్చే వర్షం నీరు, మిషన్ భగీరథ ట్యాంకు నుంచి వృథాగా పోయే నీరు చేరేలా ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.లక్షా 76 వేల నాలుగువందలు ఖర్చు చేశారు. హైదరాబాద్ను మొత్తం 98 వాటర్షెడ్లుగా విభజించగా గౌడవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టిన ప్రాజెక్టు
76 వాటర్ షెడ్లో ఉంది.
నీటి యాజమాన్యంపై విద్యార్థులకు అవగాహన ఈ ప్రాజెక్టులో భాగంగా డైరెక్టర్ కల్పనా రమేశ్ నీటి యాజమాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి ప్రాధాన్యత, యాజమాన్యం గురించి భవిష్యత్తు తరాలకు వివరిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 482 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారు వివిధ అవసరాల నిమిత్తం 8 నుంచి 10వేల లీటర్లను వినియోగిస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఆర్వో వాటర్ ట్యాంక్ నుంచి వృథాగా పోయే నీరు, విద్యార్థులు చేతులు కడుక్కునే నీటిని ఆవరణలో ఉన్న మొక్కలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు.
జీరో డిశ్చార్జ్తో ఎన్నో ఉపయోగాలు
ఒక సంస్థ, ఇల్లు ఏదైనా మనం రోజు వినియోగించే నీరు వృథాగా డ్రైయిన్స్లోకి వెళ్లకుండా రీయూజ్ గానీ, భూగర్భంలోకి ఇంకించడాన్ని జీరో డిశ్చార్జ్ అంటారు. దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వర్షపునీటిని, వినియోగించే నీటిని జీరో డిశ్చార్జ్గా మారిస్తే అర్బన్ ఫ్లడ్ అనేది ఉండదు. విద్యార్థుల్లో నీటి పరిరక్షణపై అవగాహన పెంచేందుకు గౌడవెల్లితో పాటు పలు పాఠశాలల్లో నీటి సంరక్షణ ప్రాజెక్టులు నిర్వహించాం. ఏడాదిలోనే 21 లక్షల లీటర్ల క్లీన్ వాటర్ సేవ్ చేశాం. అంటే లీటర్కు రూపాయి చొప్పున లెక్క కట్టినా 21 లక్షల రూపాయలు సేవ్ చేశాం.
-కల్పనా రమేశ్, రెయిన్ వాటర్ ప్రాజెక్టు డైరెక్టర్