సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దళితుల సాధికారతలో జలమండలి తనదైన పాత్ర పోషిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా జలమండలి లబ్ధిదారులకు 162 మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను అందిస్తున్నది. మురుగు వ్యర్థాల తరలింపు వాహనాల పంపిణీ ప్రక్రియను సోమవారం గాంధీ జయంతి రోజున హుస్సేన్సాగర్ తీరంలోని భారీ అంబేద్కర్ విగ్రహం ఎదుట మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దళిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం, నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు సిల్ట్ కార్టింగ్ (మురుగు వ్యర్థాల రవాణా) వాహనాల ముఖ్య ఉద్దేశమని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. జలమండలి గతంలోనూ ఇలాంటి చర్యలు చేపట్టిందని, 2017లో ప్రవేశపెట్టిన సీవర్ జెట్టింగ్ యంత్రాలతో పలువురు కార్మికులను యజమానులను చేసిందని ఎండీ గుర్తు చేశారు. ఈ వాహనాలను తీసుకోవడం వల్ల లబ్ధిదారుడు యజమానిగా ఉంటూ.. మరోవైపు డ్రైవర్గా కూడా ఉపాధి పొందుతున్నాడని తెలిపారు. ప్రతి వాహనానికి ఇద్దరు మజ్దూర్లు కావాల్సి ఉన్నందున.. ఆ కుటుంబంలోని వారే ఇద్దరు కార్మికులుగా కూడా ఉపాధి పొందే వీలు ఉంటుందన్నారు.
మరిన్ని సేవలందించేందుకు..
నగరంలో పారిశుధ్య నిర్వహణకు జలమండలి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. మ్యాన్హోల్ శుభ్రం చేసిన తర్వాత అందులో నుంచి తీసిన వ్యర్థాలు (సిల్ట్) ఎప్పటికప్పుడు అక్కడి నుంచి తొలగించేందుకు నూతన వాహనాలను తీసుకువచ్చింది. వీటిని మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలు అంటారు. వీటిని దళితులకు అందజేయడం, వారి కుటుంబాలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఈ వాహనాల ద్వారా మ్యాన్హోల్స్ వద్ద సిల్ట్ని ఎప్పటికప్పుడు తొలగించి మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుంది.
నాలుగు జిల్లాలలబ్ధిదారులు..162 వాహనాలు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సంబంధిత ఎమ్మెల్యేల ఆమోదం మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగింది. వీరందరికీ ఒక్కో వాహనం చొప్పున 162 వాహనాలను అందిస్తున్నారు. ఈ లబ్ధిదారులకు వీటిపై గత నెల 26న అవగాహన కల్పించారు. జలమండలి పరిధిలో ఉన్న 162 సెక్షన్లలో.. సెక్షన్కు ఒకటి చొప్పున వీటిని కేటాయించనున్నారు. వాటి పరిధిలోనే వీరు పనిచేయాల్సి ఉంటుంది.
కలిగే ప్రయోజనాలు..
వాహన నిర్వహణ వివరాలు (నెలకు)
దళిత బంధు కింద తీసుకునే మురుగు వ్యర్థాల తరలింపు వాహనానికి జలమండలి ద్వారా జరిగే చెల్లింపుల ప్రక్రియ ఇలా ఉంటుంది.
జిల్లాలు.. వాహనాల సంఖ్య
జిల్లా : వాహనాలు
హైదరాబాద్ ; 88
రంగారెడ్డి : 35
మేడ్చల్- మల్కాజిగిరి : 37
సంగారెడ్డి : 02
మొత్తం : 162
ఏడాదికిరూ.10 లక్షల పైనే..
దళితబంధు పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నందున రూ.16.20 కోట్లతో 162 మందికి ఈ వాహనాలను ఇస్తున్నారు. ఒక్కో వాహనం ఖరీదు రూ.9.50 లక్షలు కాగా.. రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఖర్చుల కింద రూ.50వేల చొప్పున లబ్ధిదారులకు అందజేస్తున్నారు. 162 వాహనాలను అద్దెకు తీసుకోవడం ద్వారా వాటికి జరిగే చెల్లింపులు, లబ్ధిదారుడికి వచ్చే ఆదాయం, నిర్వహణ వ్యయం ఇలా అన్ని కోణాల్లో జలమండలి అధికారులు ప్రాజెక్టు వివరాలను రూపొందించారు. దాని ప్రకారం ఒక్కో వాహనానికి జలమండలి నెలకు రూ.1.20 లక్షలు చెల్లించనున్నది. ఇందులో నిర్వహణ వ్యయం పోగా.. ఒక్కో దళిత కుటుంబానికి రూ.90వేలకు పైగా (ఆ కుటుంబంలోని వారే డ్రైవరు, కార్మికులుగా పని చేస్తే) ఆదాయం వస్తుంది. అంటే.. ఏడాదికి ఒక్కో కుటుంబ ఆదాయం సుమారు రూ.పది లక్షలకు పైగానే ఉంటుంది.
(ఒక్కో వాహనానికి ఇలా)
వాహనానికి అద్దె చార్జీ – రూ.23,150
డ్రైవర్ – రూ.27,090
మజ్దూరు (కార్మికులు) ఇద్దరు – రూ.43,680(ఒక్కరికి రూ.21,840 చొప్పున)
డీజిల్ ఖర్చు (రోజుకు 8 లీటర్లు) రూ. 21, 840
లుబ్రికెంట్ రూ. 1000
ఇన్సూరెన్స్ రూ. 2,500
ఇతర ఖర్చులు రూ. 740
మొత్తం.. రూ.1.20 లక్షలు
162 వాహనాలకు ఒక నెలకు కలిపి రూ.1.94 కోట్లు ఖర్చు కాగా.. సంవత్సరానికి రూ.23.33కోట్లు అవసరమవుతాయి.