రోడ్లపై వ్యర్థాలు వేయకుండా సర్కిల్లో 70 బిన్స్ ఏర్పాటు
తడి, పొడి, హానికర వ్యర్థాల కోసం బిన్లు ఏర్పాటు
ఖైరతాబాద్, మే 25 : విశ్వ నగరంలో సుందరీకరణకు ప్రభుత్వ పెద్దపీట వేసింది. నగర వ్యాప్తంగా కాలనీలు, బస్తీలు, రహదారుల వెంట బిన్ఫ్రీగా మార్చడంతో పాటు కూడళ్ల అభివృద్ధి, ఫుట్పాత్ల పునర్నిర్మాణం, పచ్చదనం కోసం మొక్కల పెంపకం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నది. పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా, రోడ్లపై ఓ చిన్న కాగిత ముక్క కూడా ఉండకుండా చేసేందుకు జీహెచ్ఎంసీ ద్వారా తడి, పొడి, హానికర చెత్త డబ్బాలను ఏర్పాటు చేసింది.
70కి పైగా ట్రై బిన్స్
సర్కిల్ -17 పరిధిలోని ప్రధాన రహదారుల్లో నిత్యం వేలాదిగా వాహనాలు సంచరిస్తుంటాయి. బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, పర్యాటక స్థలాల వద్ద ప్రతి రోజూ పర్యాటకులు, సందర్శకులు, పాదచారులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిను బండారాలు, ఆహార పదార్థాలను తిన్న తర్వాత రోడ్లపై వేస్తుంటారు. కొందరు చిన్న పిల్లల డైపర్లు, శానిటరీ నాప్కిన్లు సైతం నిర్లక్ష్యంగా రోడ్లపై వేస్తారు. అలాంటి వ్యర్థాలు రోడ్లపై వేయకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ట్రైబిన్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సర్కిల్లోని ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్నగర్ డివిజన్లలో సుమారు 70కిపైగా తడి, పొడి, హానికర చెత్త డబ్బాలను ఏర్పాటు చేసింది.
ట్రైబిన్స్లో వ్యర్థాలు.. డంపింగ్ యార్డుకు
ప్లాస్టిక్ కవర్లు, ఐస్క్రీమ్, ఇతర తినుబండారాల డబ్బాలు, ప్యాకింగ్ వ్యర్థాల కోసం పొడి చెత్త డబ్బా, అరటి, మామిడి, సపోట, సంత్రా, బత్తాయి పండ్ల తొక్కలు, మిగిలిపోయిన అన్నం, ఇతర ఆహార పదార్థాలకు తడి చెత్త, డైపర్స్, శానిటరీ నాప్పికన్స్, బ్యాండేజెస్, దెబ్బ తగిలినప్పుడు వేసిన కట్లు, దూది ముక్కలు లాంటి వాటి కోసం హానికరమైన చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. ఆయా వ్యర్థాలు రోడ్లపై వేయకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు పచ్చ రంగులో తడి, నీలం రంగులో పొడి, ఆరెంజ్ రంగులో హానికర చెత్త డబ్బాలుగా విభజించి, వాటిపై దాని ఉద్దేశాన్ని సైతం వివరించారు.
ప్రజలను భాగస్వాములను చేసేందుకే..
ప్రధానంగా రోడ్లు, పార్కులు, పర్యాటక స్థలాల వద్ద వ్యర్థాలు ఎక్కువ వాడుతుంటారు. నిత్యం రోడ్లను ఉదయం, సాయంత్రం వేళల్లో పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించినా ఇతర సమయాల్లో పర్యాటకులు, పాదచారులు, సందర్శకులు రోడ్లపై వ్యర్థాలను వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ మూడు బిన్లను ఏర్పాటు చేశాం. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలను భాగస్వాములు చేస్తే వీటిని అవసరమైన చోట్ల ఏర్పాటు చేశాం. ప్రజలు తమ వంతు బాధ్యతగా వీటిని వినియోగించుకోవాలి. – డాక్టర్ భార్గవ నారాయణ, ఏఎంవోహెచ్, సర్కిల్ 17