అబిడ్స్, నవంబర్ 26 : ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నగరంలో స్పెషల్ సమ్మరి రివిజన్-2021 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోకి వచ్చే ప్రజలు తమ పేర్లను సరి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్లెవెల్ అధికారులు అందుబాటులో ఉండి నూతన ఓటర్ల నమోదు, సవరణ, బదిలీ ప్రక్రియను చేపడతారు. గోషామహల్ నియోజకవర్గంలోని 106 ప్రాంతాల్లోని 235 పోలింగ్ కేంద్రాలలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమం కొనసాగనుంది. బీఎల్ఓలు పోలింగ్ బూత్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
చేర్పుల, మార్పులకు అవకాశం
ఓటరు జాబితాలో పేర్లు లేని వారు శని, ఆదివారం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇటీవల ఉన్నాధికారులు విడుదల చేసిన ఓటరు జాబితాను అధికారులు విడుదల చేయగా ఆ జాబితాతో బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటారు. నూతనంగా ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోవాలనుకునే వారు చిరునామా, వయసు ధృవీకరణ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. అదే విధంగా తప్పొప్పుల సవరణ, చిరునామా మార్పు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని 14వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీనివాస్ తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఓటరు నమోదు ప్రక్రియ
గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్ ఆదేశాల మేరకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటరు జాబితాలో పేర్లు లేని వారికి ఫారం-6 అందించి వారి దరఖాస్తులను అధికారులకు అందజేస్తున్నారు. మంగళ్హాట్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో బుజ్జి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. జాంబాగ్ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు మీసాల క్రాంతి, బేగంబజార్లో సంతోషి, గోషామహల్లో కోటి శైలేష్ ఫారాలను పంపిణీ చేశారు.