కుత్బుల్లాపూర్, అక్టోబర్ 26 : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. జరుగబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి కుత్బుల్లాపూర్ 131 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి అభ్యర్థులు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ప్రతిపక్షాల కుట్రలను, బుదరజల్లే రాజకీయాలను పట్టుకొని సమయాన్ని వృథా చేయకూడని కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాయని అన్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, గులాబీ సైనికులు ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధిని వివరించి, కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించాలి సూచించారు. ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కులేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, మాజీ కౌన్సిలర్ కిషన్రావు, పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, కిశోర్చారి, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.