ఎఫ్ఓజీఎస్ఐ అధ్యక్షురాలు డాక్టర్ శాంతకుమారి
శేరిలింగంపల్లి, మార్చి 17 : దేశవ్యాప్తంగా విటమిన్ డీ లోపంతో 50 నుంచి 94 శాతం మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఓజీఎస్ఐ) అధ్యక్షురాలు డాక్టర్ శాంతకుమారి అన్నారు. నానక్రాంగూడలోని హయత్ హోటల్లో గురువారం ఎఫ్ఓజీఎస్ఐ, పల్స్ ఫార్మాసిటికల్స్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల్లో విటమిన్ డీ లోపం నిశ్శబ్ద రుగ్మతగా పెరిగిపోతున్నదని, దేశంలో వారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నదని అవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్స్ ఫార్మాసిటికల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.