Hyderabad | హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): చారిత్రక హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో ఎంతో అద్భుతంగా ఉన్నదని ఆసియాన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. హైదరాబాద్లో ఉన్న వసతులు, ఆతిథ్యంపై సంతోషం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఔటర్రింగ్రోడ్డు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నదని కొనియాడారు. ఇండియా పర్యటన షెడ్యూల్లో హైదరాబాద్ నగరాన్ని తప్పక భాగం చేసుకోవాలని తమ దేశ యువతకు సూచిస్తామని చెప్పారు. ‘ఆసియాన్-ఇండియా మీడియా’ ఎక్సేంజ్లో భాగంగా మయన్మార్, కాంబోడియా, వియత్నాం, థాయ్లాండ్, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం తెలంగాణలో ఈ నెల 12 నుంచి పర్యటిస్తున్నది. ఆసియాన్ సెక్రటేరియట్కు చెందిన సీనియర్ ఆఫీసర్ పటగియా థింగ్వుయాంగ్ ఆధ్వర్యంలోని ఈ బృందం హైదరాబాద్లోని పలు పారిశ్రామిక, చారిత్రక, వాణిజ్య, ఆర్థిక సంస్థలను బుధవారం సందర్శించింది.
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం భవనం, అమరుల స్మారక చిహ్నంతోపాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, భారత్ బయోటెక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, శిల్పారామం తదితర ప్రాంతాలను సందర్శించింది. ఆయా ప్రాంతాల, నిర్మాణాల విశిష్టతలను వారికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకుడు రాజమౌళి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను వివరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల బృందం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో నెలకొన్న ఆధునిక వసతులను ప్రశంసించింది. అనంతరం ఈ బృందం శంషాబాద్ విమానాశ్రయం నుంచి సింగపూర్ ద్వారా తమ దేశాలకు తిరుగు పయనమైంది.