సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఈనెల 18న వినాయక చవితి నవరాత్రులు మొదలై 28వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుందని, అన్ని ప్రభుత్వ శాఖలు, గణేశ్ ఉత్సవ సమితి సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుందామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. ఉత్సవాలకు సంబంధించి కోర్టు ఆదేశాలను పాటిద్దామని సీపీ సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు డీఎస్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్రతో పాటు విద్యుత్, ఆర్టీసీ, వాటర్ వర్క్స్, ఇరిగేషన్, మెట్రో తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో గురువారం బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ నెల 18న గణేశ్ చవితి నవరాత్రులు మొదలై 28న నిమజ్జనోత్సవం ఉంటుందనిభాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు సూచించారు. కొన్ని సమస్యలు, పరిష్కారాలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లపై గుంతలు పూడ్చం, రాత్రి సమయంలో వెలుతురు సరిగ్గా ఉండేలా చూడటం, నిమజ్జనానికి అవసరమయ్యే వాహనాలను మండపాల నిర్వాహకులకు అందుబాటులో ఉండేలా చూడటం, నిమజ్జనం రోజు అర్ధరాత్రి వరకు కూడా తాగునీరు, ఆహారం అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఉత్సవ సమితి ప్రతినిధులు కోరారు.
ఆయా శాఖల అధికారులు వెంటనే స్పందించి.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు, జీహెచ్ఎంసీ, ఇతర శాఖలు అందిస్తున్న సేవలను ఉత్సవ సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంసించారు. అనంతరం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ట్రై పోలీస్ కమిషనరేట్ల మధ్య సమాచార మార్పిడి, సమన్వయంతో పని చేస్తామన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాలను అందరూ పాటించాలని కోరారు. మండపాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిమజ్జనం రూట్ను తెలుపాలని సూచించారు. గతేడాది 10 ఫీట్లకు పైగా ఉన్న 15,000 విగ్రహాలను రికార్డు చేయలేదని, నిమజ్జనానికి వచ్చాయన్నారు.
విగ్రహాల నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉన్నదన్నారు. మండపాల నిర్వాహకులు ఇచ్చే సమాచారంతోనే సంబంధిత శాఖలు తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలు ఉంటుందని తెలిపారు. సరైన భద్రత, సీసీటీవీ కవరేజ్, మండపాల వద్ద తీసుకోవాల్సిన భద్రత, జాగ్రత్తలపై వివరించారు. నిమజ్జనోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. రోడ్ల మరమ్మతు పనులు, లైటింగ్, చెట్ల కత్తిరింపు, బేబీ పాండ్స్, చెరువులలో పూడిక తీత పనులు జరుగుతున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులకు సంబంధించిన ఫోన్ నంబర్లతో కూడిన బుక్ను అందరికీ అందజేస్తామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు. ఆయా శాఖల సంబంధిత అధికారులు ఏర్పాట్లను వివరించారు.