సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ) : వర్షాకాలంలో సంభవించే అంటు వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ముంతాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలు నీటి నిల్వలపై తప్పక మూతలు పెట్టాలని, తోక పురుగులు కనిపిస్తే వెంటనే తీసి వేయాలని ఆయన కోరారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే బస్తీ ప్రజలు దోమ కాటు బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దోమల నివారణకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ లో 34 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, వారికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉర్దూ లో తయారీ చేసిన కరపత్రాలు, గోడ పత్రికలను, స్టికర్స్ ను విడుదల చేసారు.
చార్మినార్ జోన్ సీనియర్ ఎంటోమలజిస్ట్ నామాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలు, నీటి నిల్వలు లేకుండా, వ్యర్థంగా ఉన్న టైర్స్, కూలర్స్, కొబ్బరి బొండాలు, లేకుండా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బాకర్, ముజ్జు పాటిల్ , అసిస్టెంట్ ఎంటోమాలజిస్ట్, చందు లాల్, సూపర్వైజర్స్, గణేష్, గోపాల్, మహేశ్ తదితరలు పాల్గొన్నారు.