సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. మల్కాజిగిరి షీ టీమ్స్కు నెలకు 200 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డెకాయి అపరేషన్లు నిర్వహిస్తున్నా పోకిరీలలో భయం లేకుండా పోతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో వేధింపులు పెరగడం, రోడ్లపైనే పోకిరీల యధేచ్చగా వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో డెకాయి అపరేషన్లతో పట్టుబడుతున్న పోకిరీలలో చాలామందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. షీ టీమ్స్కు వస్తున్న ఫిర్యాదులలో ఫోన్, సోషల్ మీడియాతో పాటు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్న వారు ఉంటున్నారు.
షీ టీమ్స్కు వస్తున్న ఫిర్యాదులలో ఆయా కేసుల తీవ్రతను బట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఫిర్యాదులపై విచారణ జరిపి కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. వేధింపులలో ఎక్కువగా తెలిసిన వారే ఉంటున్నారు, తెలిసిన వారి ద్వారానే బాధితులు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నట్లు దర్యాప్తులో బయటపడుతున్నది. మహిళలు వేధింపులపై మౌనంగా ఉండవద్దని, ధైర్యంగా వచ్చి షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు మల్కాజిగిరి మహిళా భద్రత డీసీపీ ఉషారాణి వెల్లడించారు.