సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అఫిలియేషన్ కాలేజీల్లో 50 శాతానికి పైగా నకిలీ డాక్యుమెంట్లు దాఖలు చేసినట్లు యూనివర్సిటీ అధికారుల దృష్టి రావడంతో ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల నుంచి నకిలీ డాక్యుమెంట్లతోనే అఫిలియేషన్లు పొందుతున్నప్పటికీ.. ఆ ప్రక్రియ మొత్తం మాన్యువల్గా జరుగుతుండడం వల్ల ఒరిజినల్ డాక్యుమెంట్లకు, నకిలీ డాక్యుమెంట్ల గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు. దీంతో ఒరిజిల్నల్ డాక్యుమెంట్లను తలపించే విధంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తూ.. అఫిలియేషన్ పొందుతున్న యాజమాన్యాల ఆటలు ఇక సాగే అవకాశాలు లేవు. ప్రైవేటు కాలేజీలు అఫిలియేషన్ ప్రక్రియలో నకిలీ డాక్యుమెంట్లకు శాశ్వతంగా స్వస్తి పలుకడంపై ఓయూ అధికారులు దృష్టి సారించి.. ఆ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగా ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్లు కల్పించడం కోసం ప్రతి ఏడాది ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఆన్లైన్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్లో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, తహసీల్దార్ కార్యాలయాలతో(రెవెన్యూ శాఖ) అవగాహన ఒప్పందం చేసుకోబోతున్నారు. ఈ మేరకు వచ్చే నాలుగు లేదా ఆరు వారాలలో సాఫ్ట్వేర్ను సిద్ధం చేసి, 2023-24 విద్యా సంవత్సరం అఫిలియేషన్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, లా వంటి పలు రకాల కోర్సులు కలిపి మొత్తం 700 వరకు అఫిలియేషన్ కాలేజీలు కొనసాగుతున్నాయి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఓయూ తీసుకోనున్న కఠిన నిర్ణయా వల్ల దాదాపు 50 శాతం కాలేజీలపై ఆ ప్రభావం పడుతుందని ఓయూ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా అఫిలియేషన్ దరఖాస్తులు..
ఇక నుంచి ఓయూ ఆధ్వర్యంలో ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్తో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి అన్ని రకాల కాలేజీలలో అఫిలియేషన్ పొంద డం కోసం ఇక మాన్యువల్ దరఖాస్తుల విధానానికి కూడా స్వస్తి పలుకుతున్నారు. ఈ క్రమంలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం డాక్యుమెంట్లను ఆన్లైన్ ద్వారా తనిఖీలు నిర్వహించనున్నట్ల్లు అధికారులు తెలిపారు.
నాణ్యమైన విద్యా విధానమే లక్ష్యం : ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, ఓయూ వీసీ
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అన్ని రకాల కాలేజీల్లో నాణ్యమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో.. ప్రైవేటు కాలేజీలను బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు. అందుకోసం విద్యా ప్రమాణాలు పాటించే కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పైగా నాణ్యమైన కాలేజీలను యూనివర్సిటీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. అదే క్రమంలో యూనివర్సిటీ అఫిలియేషన్ పొందే క్రమంలో నకిలీ డాక్యుమెంట్లు దాఖలు చేసిన ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి యూనివర్సిటీ సిద్ధంగానే ఉంటుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా విధానాన్ని అందించడం కోసం యాజమాన్యాలు కృషి చేయాలన్నారు.