రవాణాశాఖ సెంట్రల్ సర్వర్తో ప్రతి వాహన కాలుష్యం పరీక్ష యంత్రాన్ని అనుసంధానించి ఆన్లైన్ ద్వారా సిస్టం జనరేటెడ్ ధ్రువపత్రం వాహనదారులకు అందజేస్తున్నారు. ఒక వేళ పరీక్ష సెంటర్కు వచ్చిన వాహనం నిర్ణీత ప్రమాణాలకు మించి కాలుష్యం వెదజల్లితే నంబరు ఆధారంగా ఆటోమేటిక్గా సీజ్ చేస్తారు. పరీక్ష కేంద్రంలో పరిశీలన పూర్తయ్యాక ఆ రీడింగ్స్ సెంట్రల్ సర్వర్కు ఆటోమెటిక్గా వస్తాయి. అవి సరైనవిగా ఉంటే అక్కడి నుంచి పరీక్ష సెంటర్కు ఒకే అని ధ్రువపత్రం జనరేట్ అవుతుంది. ఒకవేళ రీడింగ్స్ సరైనవి కాకపోతే సర్టిఫికెట్ జనరేట్ కాదు. ఇలా కాలుష్యకారక వాహనాలకు చెక్ పడనుంది. అయితే చాలా మంది పీయూసీ ధ్రువపత్రం పొందకుండా రోడ్లపై తిరుగుతుంటారు. అలాంటి వాహన యజమానులకు రిజిస్టర్ మొబైల్ ఆధారంగా సందేశం వెళ్తుంది. కాలపరిమితికి కొద్ది రోజుల ముందే మీ వాహనం కాలుష్యం సర్టిఫికెట్ గడువు ముగియబోతుందని గుర్తు చేస్తూ సందేశాలు పంపిస్తుందని రవాణాశాఖకు చెందిన ఓ సీనియర్ ఆధికారి తెలిపారు. మరికొంతమంది వాహనదారులు ఎలాంటి కాలుష్య పరీక్ష లేకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. ఎవరైతే నిర్ణీత క్రమంలో కాలుష్య పరీక్ష చేసుకుంటున్నారో.. చేసుకోవడం లేదో సాఫ్ట్వేర్ ఆధారంగా ఆ జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతమున్న యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను బిగించుకోవాలని టెస్టింగ్ ఏజన్సీలకు ఇప్పటికే రవాణాశాఖ ఆదేశాలిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో టెస్టింగ్ యంత్రాలు సుమారు 494 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.