మన్సూరాబాద్, అక్టోబర్ 8: వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 6న జరిగిన ఓ వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తులు తన పేరుపై రాయించుకోవడమే గాక.. ఇతరులతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో కట్టుకున్న భర్తే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయిశ్రీ వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన తన్నీరు బాలకోటయ్య (40) బిల్డర్. ఆయనకు 2008లో శాలిని (32)తో వివాహం జరిగింది. బాలకోటయ్య, శాలిని దంపతులకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం బాలకోటయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని అంజనాపురిలో ఉంటున్నాడు. భార్య ఇతరులతో సన్నిహితంగా ఉంటుందని, తన ఆస్తులను ఆమె పేరుపై రాయించుకుందనే ఆగ్రహంతో ఆమెను తరచూ వేధింపులకు గురి చేశాడు. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగాయి. పెద్ద మనుషుల సమక్షంలో ఇరువురిని కూర్చోబెట్టి నచ్చజెప్పినప్పటికీ బాలకోటయ్యలో మార్పు రాలేదు. బాలకోటయ్య వేధింపులు భరించలేని శాలిని గత జూలై నెలలో వనస్థలిపురంలో ఉండే తల్లిదండ్రులకు వద్దకు తన ఇద్దరు కుమారులతో కలిసి వచ్చింది.
తల్లిదండ్రుల వద్దనే ఉంటూ.. పిల్లలను చదివించుకుంటున్నది. తన ఆస్తులను రాయించుకోవడమే కాకుండా ఇతరులతో సన్నిహితంగా ఉంటూ.. తనను దూరంగా పెట్టిన శాలినిని ఎలాగైనా హతమార్చాలని బాలకోటయ్య పథకం వేసుకున్నాడు. పది రోజుల కిందట శాలిని తల్లిదండ్రులు సొంతూరికి వెళ్లిన విషయం తెలుసుకున్నాడు. ఈ నెల 6న సాయంత్రం శాలిని తన స్కూటీపై అంజనాపురికి వెళ్లి ఇంటిని శుభ్రం చేసి తిరిగి వస్తుంది. విషయాన్ని తెలుసుకున్న బాలకోటయ్య ఆమెను వెతుక్కుంటూ బయలుదేరగా.. విజయపురికాలనీలోని సాయిబాబా దేవాలయం సమీపంలో స్కూటీపై వస్తున్న శాలిని కనిపించింది. తన బైకుతో ఆమె స్కూటీని ఢీకొట్టగా.. కింద పడిపోయింది. ఇదే అదునుగా భావించిన అతడు పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై రెండుసార్లు మోది హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి సోదరి రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో సూర్యాపేట టౌన్ బస్టాప్లో ఉన్న బాలకోటయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. శాలినిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు బాలకోటయ్యను రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి బైకు, మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.