హిమాయత్నగర్, డిసెంబర్ 20 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 23న హిమాయత్ నగర్, లిబర్టీలోని బాలాజీ భవన్, జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వరస్వామి దేవాలయాలలో ఉత్తర ద్వార స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ డిప్యూటీ ఈవో రమేశ్బాబు తెలిపారు. బుధవారం హిమాయత్నగర్లోని టీటీడీ ఆవరణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సూర్యోదయానికి ముందే 3:30 గంటలకు ప్రముఖులకు 30 నిమిషాల పాటు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని, ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సర్వదర్శనం ఉంటుందన్నారు.
వేకువ జామున 1 నుంచి 3 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువ, పంచాగ శ్రవణం ఏకాంత సేవలు నిర్వహించి 3:30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఈ నెల 23న జరిగే ఆర్జిత, కల్యాణ మహోత్సవాల సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ సమావేశంలో లోకల్ అడ్వైజరీ కమిటీ (ఎల్ఏసీ) జూబ్లీహిల్స్లో ఆలయం ఉపాధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, సభ్యులు వెంకట్రెడ్డి, హరికిషన్ తెలిపారు.