మణికొండ, ఏప్రిల్ 2 : ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ సూచించారు. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో 12మంది పిల్లలకు, నలుగురు గర్భిణులకు టీకాలు ఇవ్వడంతో పాటు పలు సూచనలు చేశారు. అదే విధంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాళీ మందిర్ ప్రాంతంలో పర్యటించి రెండు సంవత్సరాలలోపు పిల్లలకు టీకాలు అందజేశారు.
గర్భిణులకు టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యవిస్తరణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని ఆర్యోవంతమైన సమాజాన్ని రూపొందించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, డబ్ల్యూహెచ్వో పర్యవేక్షణ అధికారి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
నర్కూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…
శంషాబాద్ రూరల్, మే 2 : ప్రతి చిన్నారికి టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలని వైద్యురాలు దివ్య సూచించారు. సోమవారం నర్కూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమంలో భాగంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 2 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు, గర్భిణులకు వ్యాధినిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో నర్కూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు శంషాబాద్ పట్టణం, కొత్వాల్గూడ, సిద్ధాంతి తదితర ఏరియాలో టీకాలు వేస్తామని తెలిపారు. వైద్య సిబ్బంది, ఆయా గ్రామాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మైలార్దేవ్పల్లిలో…
చిన్నారులకు టీకాలు తప్పని సరిగా వేయించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ స్వాతి సూచించారు. సోమవారం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీగూడలో చిన్నారులకు టీకాలు వేశారు. ఆరోగ్య అధికారి చెన్నకేశవులు, సూపర్ వైజర్ శివకుమార్, ఏన్ఎంలు పాల్గొన్నారు.