మియాపూర్, జూన్ 23 : మానవ మనుగడ పచ్చదనంతో అల్లుకుని ఉన్నదని ఆరోగ్యంగా జీవించేందుకు ఆహ్లాదకరమైన ప్రకృతి అవసరమని అందుకోసం మొక్కలు నాటాలని.. కాలుష్య రహిత వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రస్తుత తరాలతో పాటు భావి తరాల కోసం ఈ ప్రకృతి ఉద్యమాన్ని దిగ్విజయంగా చేపట్టాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పొదుపు సంఘాల మహిళలకు అవగాహనతో పాటు.. వినాయక ఉత్సవాలకు మట్టి గణపతుల వినియోగంపై జోనల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్సీ శంకరయ్య, డీసీలు వెంకన్న, నందగిరి సుధాంశ్, జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మిలతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం మొక్కలు నాటడం వరకే కాకుండా.. వాటిని సంరక్షించుకోవాలని, పొదుపు సంఘాల మహిళలు ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఖాళీ స్థలాలన్నింటా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ నిమిత్తం ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను సైతం అందిస్తున్నదని, సద్వినియోగం చేసుకుని హరితహారాన్ని విజయవంతం చేయాలని విప్ గాంధీ కోరారు. ఈ సారి ఉత్సవాలలో పీవోపీ విగ్రహాలకు అనుమతి లేదని, ప్రతి ఇంటా మట్టి గణపతినే పూజించాలని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ సృజన, అధికారులు అనీల్కుమార్, మాన్వి, ఉషారాణి, డాక్టర్ నగేశ్ నాయక్, యూసుఫ్, చంద్రారెడ్డి, జలంధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ..
జీహెచ్ఎంసీ అలింకో సంస్థల సంయుక్తంగా దివ్యాంగులకు, వృద్ధులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీకి సంబంధించి నిర్వహించనున్న ఎంపిక గుర్తింపు శిబిరం పోస్టర్ను జడ్సీ శంకరయ్య, డీసీలు వెంకన్న, నందగిరి సుధాంశ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మితో కలిసి విప్ గాంధీ జోనల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఈ నెల 30న శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ మీటింగ్హాల్లో, జూలై 1న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్యాణ మండపంలో శిబిరాలను నిర్వహిస్తారని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తగు ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.
సీఎం సహాయనిధి అందజేత..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు డివిజన్లకు చెందిన దరఖాస్తుదారులకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ.6.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను విప్ గాంధీ గురువారం తన నివాసంలో లబ్దిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, శ్రీనివాస్, కాశీనాథ్ పాల్గొన్నారు.
కృతజ్ఞతలు..
గచ్చిబౌలి ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా మీనాక్షిటవర్స్ నుంచి రోడ్డు విస్తరణను 200 ఫీట్ల నుంచి 150 ఫీట్లకు తగ్గించటాన్ని హర్షిస్తూ పీజేఆర్నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు విప్ గాంధీని ఆయన నివాసంలో కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు చాంద్పాష, కైలాశ్ సింగ్ అచ్చేశ్వర్రావు, దుర్గాప్రసాద్, షౌకత్, రంగారావు, సంకేష్, కృష్ణ, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.