మేడ్చల్, ఫిబ్రవరి 21 నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులలో సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు. కీసర, మేడ్చల్, ఉప్పల్, దూలపల్లి ప్రాంతాల్లో ఉన్న 11 అర్బన్ పార్క్లో పచ్చదనం తగ్గకుండా ఉండేలా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా గతంలో నాటిన వాటిలో కొన్ని మొక్కలు ఎండిపోగా.. వాటి స్థానంలో తిరిగి నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఈ పార్కులను దట్టమైన అటవీ ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నారు. పచ్చందాలతో పాటు పర్యాటకుల కోసం వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్లు, యోగా కేంద్రాలు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
హరితహారంలో నాటనున్న మొక్కలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఔషధ మొక్కలతో పాటు పూల మొక్కలు, మర్రి, రావి, కరివేపాకు తదితర మొక్కలను నాటనున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అర్బన్ పార్క్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 2 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో మరిన్ని అర్బన్ పార్క్లు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అటవీ రెంజ్ పరిధిలో మరిన్ని అర్బన్ పార్క్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్థలాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే పనులను సైతం మొదలు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
మేడ్చల్ జిల్లా శాంతివనం అర్బన్ పార్క్లో వాకింగ్ ట్రాక్