రామన్నపేట, ఏప్రిల్ 19 : విద్యార్థులను భావిభారత పౌరులుగా తయారు చేసే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, వృత్తి ధర్మం నెరవేరుస్తూనే విద్యార్థులతోపాటు సమాజాన్ని చైతన్యపర్చడం తమ బాధ్యతగా భావిస్తూ ఆ దిశగా కృషి చేస్తున్నాడు పాల్వంచ హరికిషన్.రామన్నపేట మండల కేంద్రానికి చెందిన పాల్వంచ హరికిషన్ 2001 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఆలేరు మండలం రాఘవాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హరికిషన్ సమాజ చైతన్యానికి ఉపాధ్యాయ వృత్తిని మార్గంగా ఎంచుకున్నాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటాడు. విద్యాబోధనతోపాటు చిత్రలేఖనం, చిన్న, చిన్న కథలు, కవితలు రాయడంలో విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల రచనలను బాలల పత్రికలకు పంపిస్తూ బాల సాహిత్యంలో తన పాత్రను పోషిస్తున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే విద్యాసంబంధ పోటీల్లో పాల్గొనేలా చైతన్య పరుస్తున్నాడు.
సాహిత్య రంగంలో…
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా తన ఆలోచనలు సాహిత్యం వైపు మళ్లించి ఉద్యమ కవితలు, గేయాలు రచిస్తూ సాంస్కృతిక సృజనాత్మకత అంశాలు జోడించి కళారూపాలను ప్రదర్శిస్తూ ప్రజా చైతన్యంలో భాగస్వాములయ్యారు. ఇప్పటి వరకు 700కు పైగా కవితలు, గేయాలు రచించడమే కాకుండా కరోనా మహమ్మారి పైనా సుమారు 100కుపైగా కవితాస్ర్తాలు సందించాడు. వీటితోపాటు ‘బతుకమ్మ సంబురాలు’ ‘సంక్రాంతి పండుగ వచ్చె’ ‘తెలుగు వెలగాలిరా’ ‘అమ్మభాష’ ‘పూల పండుగ’ ‘కరోనా కట్టడి’పై ఆడియో, వీడియో పాటలను రూపొందించారు.ప్రస్తుతం ‘ప్రజామిత్ర’ సామాజిక చైతన్య సంస్థను స్థాపించి తద్వారా ఓటు విలువ, నీటి పొదుపు, విద్యుత్ వినియోగం, వృక్ష సంరక్షణ, కాలుష్య నివారణ, ఆరోగ్య సంరక్షణ మొదలైన అంశాలపై కరపత్రాలు, పోస్టర్లు వేసి బాధ్యతాయుతమైన సామాజిక కార్యకర్తగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘అర్జున’ కలం పేరుతో రచించిన గాండీవం మొదటి కవితా సంపుటి పూర్తయి త్వరలో ఆవిష్కరణ జరుపుకోబోతున్నది. ‘నానీ బత్తీసలు’ ప్రచురణకు సిద్ధంగా ఉన్నది.
కార్టూన్లతో చైతన్యం…
వందల కొద్దీ పేజీల్లో చెప్పాల్సిన అంశాలను ఒకే ఒక్క వ్యంగ్య చిత్రంతో తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజల్లో ఆలోచన ఆసక్తిని పెంపొందిస్తున్నాడు. సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు వ్యంగ్య చిత్రాలు గీస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సర కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునేలా వాస్తవ పరిస్థితులను కండ్లకు కట్టేలా అనేక వ్యంగ్య చిత్రాలు గీసి వివిధ పత్రికల ద్వారా సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 600కు పైగా కార్టూన్లు గీసి ప్రపంచ తెలుగు మహాసభల్లో, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.
ఇవీ కూడా చదవండి…