Amit Shah | కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాల పార్టీ అని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేం చెప్పేది అవాస్తవమని చెప్పాలని సవాలు విసిరారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొని బీజేపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీకి ఆప్తమిత్రుడు అని అమిత్ షా అన్నారు. అందుకే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ను చేశారని ఆరోపించారు. సీఏఏను అమలు చేసి పాక్, బంగ్లాదేశ్ శరణార్థులకు న్యాయం చేశామని తెలిపారు. సీఏఏను కాంగ్రెస్,మజ్లిస్ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. సీఏఏఈ అమలుతో ముస్లింల పౌరసత్వం రద్దవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని, బీజేపీ 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో 12కంటే ఎక్కువ సీట్లు గెలవాలని సూచించారు. ఇందుకోసం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.