చర్లపల్లి, డిసెంబర్ 18 : ఆడపిల్ల పుట్టిందని పేగు బంధాన్ని మరిచిన కన్నవారు.. కండ్లు కూడా తెరవని పసికందును వీధిన పడేశారు. గాయాలతో ఉన్న ఆ పసికందును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్ క్షణాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో ఉన్న పసికందును చూసి చలించిపోయిన ఎస్ఐ వెంటనే తన చేతుల్లోకి తీసుకొని వైద్యం కోసం ఆస్పత్రికి పరుగులు పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
తొలుత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత.. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయింది. ఈ ఘటన ఆదివారం ఏఎస్రావునగర్ పరిధిలోని కమలానగర్లో జరిగింది. కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్ కథనం ప్రకారం.. కమలానగర్లోని ఓ అపార్టుమెంట్ ఆవరణలో అప్పుడే పుట్టిన ఓ పసికందు కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని అక్కడ పడివేసి వెళ్లారు.
ప్రాణంతో ఉన్న చిన్నారిని గమనించిన అపార్టుమెంట్ వాసులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వచ్చారు. చిన్నారిని చూసి పోలీసులు చలించిపోయారు. ఎస్ఐ స్వయంగా తానే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి సాయంత్రం మరణించింది. ఈ ఘటనపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు..
చిన్నారి పడివున్న అపార్టుమెంట్ చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పాప పడివున్న తీరు.. అపార్టుమెంట్కు చుట్టపక్కల ఉన్న వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన వారిని తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఆడపిల్ల పుట్టిందని.. పేగు బంధాన్ని మరిచిపోయి పారవేశారని, ఇలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
శభాష్ ఎస్ఐ ..
ఆ చిన్నారిని చూసిన ఎస్ఐ సాయికుమార్ చలించిపోయారు. ఊపిరి ఉన్నట్టు గుర్తించిన ఆయన.. క్షణం కూడా వృథా చేయకుండా పాప ప్రాణాలు కాపాడేందుకు తపించిపోయారు. వెంటనే అంబులెన్స్ను రప్పించి, సమీపంలోనే ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి ప్రాథమిక చికిత్సను అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నిలోఫర్కు తరలించారు. వృత్తి, మానవత్వంతో తపించిన ఎస్ఐ సాయికుమార్ తీరును ప్రతి ఒక్కరూ అభినందించారు.