Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని హయత్నగర్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంగళవారం మధ్యాహ్నం కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయసు 30 ఏండ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గుర్తు పట్టకుండా ఉండేందుకే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో పలు ఆధారాలను సేకరించారు. అక్కడున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అతన్ని ఎక్కడో చంపి, ఇక్కడ పడేసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.