సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : సంచలనాలకు కేంద్రంగా మారిన పంజాగుట్ట పోలీస్స్టేషన్లో తరచూ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దొంగలు ఈజీగా పంజాగుట్ట పోలీసుల కండ్లు గప్పి పరారవుతున్నారు. గత నెలలో ఒక దొంగ పరారైన ఘటన మరువకముందే తాజాగా ఠాణాలో నుంచి కస్టడీలో ఉన్న మరో అనుమానితుడు పరారు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిమ్స్ దవాఖానలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అక్కడ గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండడంతో దొంగగా అనుమానించి స్థానికులు పోలీసులకు పట్టించారు. అతడిని పోలీస్స్టేషన్కు తరలించి పోలీసులు వివరాలు సేకరించడంతో సికింద్రాబాద్కు చెందిన టిల్లుగా తేలింది. ఇతడిపై గతంలోనూ దొంగతనం కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే అతడిని మరింత విచారించి.. ఇటీవల జరిగిన దొంగతనం కేసుల గురించి.. వాకబు చేయాలని పోలీసులు భావించారు. పోలీస్స్టేషన్ పై అంతస్తులోని క్రైమ్ రూమ్కు తరలించారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వాష్ రూమ్కు వెళ్లొస్తానని చెప్పిన టిల్లు.. పోలీసుల కండ్లు కప్పి పోలీస్స్టేషన్ పైకప్పు నుంచి పక్కకు దూకీ అక్కడి నుంచి పరారయ్యాడు. వాష్రూమ్కు వెళ్లిన టిల్లు తిరిగి రాకపోవడంతో ఠాణాలో ఉన్న పోలీసులు అతడి కోసం అన్ని చోట్ల వెతికారు. అప్పటికే టిల్లు పోలీస్ స్టేషన్ ఆవరణ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ప్రత్యేక బృందాలు టిల్లును పట్టుకోవడానికి రంగంలోకి దిగాయని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపారు.
పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు చేసిన ర్యాష్ డ్రైవింగ్ కేసును బోల్తా కొట్టించేందుకు స్వయంగా స్టేషన్ ఎస్హెచ్వో రంగంలోకి దిగడం ఆ తరువాత అరెస్ట్, సస్పెన్షన్ వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. అదే సమయంలో పంజాగుట్ట ఠాణాకు చెందిన సిబ్బంది కస్టడీలో నుంచి ఓ నిందితుడు పరారయ్యాడు.
పోలీసుల నిర్లక్ష్యం, అవినీతి వ్యవహారాలపై ఆరా తీసిన నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి..ఒకే సారి 85 సిబ్బందిని పంజాగుట్ట ఠాణా నుంచి కార్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. ఇంత కఠినంగా వ్యవహరించినా తిరిగి పోలీసులు నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. తాజాగా దొంగ పరారైన ఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.