లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురైనా.. నిరుద్యోగుల్లో సంకల్పం సడలటం లేదు. ప్రతిపక్షాల మాటలు పట్టించుకోకుండా.. ఉద్యోగ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కనిపించిన దృశ్యమిది.
సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ సాధన ప్రధాన లక్ష్యం..లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురైనా తెలంగాణ నిరుద్యోగుల్లో మాత్రం ఆ సంకల్పం సడలటం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవడంపైనే యువత దృష్టిసారించారు. ఈరోజు కాకపోతే.. రేపు అన్నట్లుగా లక్ష్యాన్ని చేరుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. యువతతో కిటకిటలాడుతున్న నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీనే ఇందుకు నిదర్శనం. ఒకవైపు నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు కుట్రలు పన్నుతున్నా… తెలంగాణ యువత మాత్రం ఒక్క క్షణం కూడా తమ ఏకాగ్రతను కోల్పోవడం లేదు. కేవలం చిక్కడపల్లి లైబ్రరీలోనే కాదు… నగరవ్యాప్తంగా ఉన్న అనేక లైబ్రరీల్లో వేలాది మంది విద్యార్థుల పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం వెలువడిన పలు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతో మంది ఉద్యోగార్థులు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలోనే కూర్చొని ఉద్యోగాలను సాధించిన కేంద్రంగా చరిత్రకెక్కింది. ఇదిలా ఉండగా పేపర్ లీకేజీల వ్యవహారంతో అభ్యర్థులు ఆందోళన చెందకుండా నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. రోజురోజుకూ గ్రంథాలయాల్లో రద్దీ పెరుగుతున్నది. ఇందుకు ఉదాహరణ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ. ప్రతినిత్యం 3వేలకు పైగా విద్యార్థులు, పాఠకులు గ్రంథాలయానికి వస్తున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరగడం దురదృష్టకరమని భావించిన నిరుద్యోగులు, తిరిగి మరింత పట్టుదలతో పూర్తిస్థాయిలో మళ్లీ పరీక్షకు సిద్ధమవుతున్నారు.
గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం ఉద్యోగాలు సాధించాలనే తపనతో గ్రంథాలయంలో ప్రిపరేషన్ కోసం అభ్యర్థులు పోటెత్తుతున్నారు. గతంలో నిత్యం మూడు వేలకు చేరువగా లైబ్రరీకి వస్తుండేవారు. ప్రస్తుతం 3వేల మంది కంటే ఎక్కువగానే వస్తున్నట్లు గ్రంథాలయ సిబ్బంది చెబుతున్నారు.
నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చే ప్రతి విద్యార్థి పుస్తకాన్ని నమ్ముకొని వస్తున్నవారే. రాష్ట్రం ఏర్పడిన అనంతరం నోటిఫికేషన్లు వెలువరించిన ప్రకారం.. అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇందుకు సీఎం కేసీఆర్ ఎంతో సహకరించి గ్రంథాలయాలను ఆధునీకరించడంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పించి తన పెద్ద మనుసును చాటుకున్నారు. ఇక్కడికి పేద విద్యార్థులు ఎక్కువగా ప్రిపేర్ అయ్యేందుకు వస్తుంటారు. అందుకు అనుగుణంగానే ప్రతి విద్యార్థికి అన్ని వసతులతోపాటు తాగునీరు, మధ్యాహ్నం ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం.
– ప్రసన్నరామ్మూర్తి, చైర్పర్సన్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లి