బంజారాహిల్స్, ఫిబ్రవరి 28 : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గత కొన్నిరోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్మికనగర్లో నివాసముంటున్న ఎస్.భరత్కుమార్(34) బీహెచ్ఈఎల్ ఆర్డీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల కిందట మమతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి బాబు(6), పాప(3) ఉన్నారు. కాగా గత నెల 31న ఓ ఫంక్షన్కు భార్యాపిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మమత అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లముందే తన భార్య దుర్మరణం చెందిన విషయాన్ని జీర్ణించుకోలేని భరత్ కుమార్ అప్పటినుంచి డిప్రెషన్లోకి వెళ్లాడు. మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు రమేశ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో నెలరోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.