వెంగళరావునగర్/ బంజారాహిల్స్, డిసెంబర్ 15: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం చెందారు. కొడుకు పెండ్లి కావడంలేదని మనస్తాపం చెందిన తల్లి గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మరో సంఘటనలో.. తల్లి మరణంతో మనస్తాపం చెందిన కూతురు.. తల్లి దగ్గరకు వెళ్తున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ రెండు ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.
కొడుకు కోసం తల్లి..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనుక బ్రాహ్మణ వీధిలో ఉంటున్న పద్మ (60) కుమారుడు శరత్. అతడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శరత్కు వివాహం కావడంలేదని తల్లి పద్మ మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పద్మ సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్నాహ్నం శరత్ ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఇంట్లో ఉన్న తల్లి తలుపులు తీయకపోవడంతో వెనక భాగంలో ఉన్న కిటికీలోంచి చూశాడు. తల్లి ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించాడు. గొళ్లెం విరగొట్టి తలుపులు తీశాడు. వెంటనే ఆమెను స్థానిక దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బతకాలని లేదు.. తల్లి దగ్గరకు వెళ్తున్నా..
తల్లి మరణంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన మన్నె నర్సింగ్ రావు 20 ఏండ్ల కిందట నగరానికి వచ్చారు. అతడి భార్య కృష్ణవేణి రెండేండ్ల కిందట సిద్దిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటి నుంచి నర్సింగ్రావు కొడుకు సాయికుమార్, కుమార్తె స్వాతి(17)తో కలిసి బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని గౌరీశంకర్ కాలనీలో ఉంటున్నాడు. స్వాతి ఇంటర్ చదువుతోంది. తల్లి మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం సాయంత్రం ఆమె తన గదిలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి ఇంటికి వచ్చిన నర్సింగ్ రావు చూసి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి చనిపోయినప్పటినుంచి తనకు బతకాలని లేదు.. తల్లి దగ్గరకు వెళ్తున్నాను.. అంటూ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.