హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని మహాబలిపురం వేదికగా దక్షిణాది రాష్ట్రాలతో నిర్వహించే సదరన్ జోనల్ కౌన్సిల్ (ఎస్జెడ్సీ) 31వ సమావేశం ఈ నెల 20న జరుగనున్నది. కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్న ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, అంతర్రాష్ట్ర వివాదాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనునారు.
ఈ మేరకు పొరుగు రాష్ట్రాలతో ఉన్న వివాదాలకు సంబంధించి ఎజెండానూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ సిద్ధం చేస్తున్నది. కర్ణాటక చేపడుతున్న అప్పర్భద్ర, ఏపీ చేపట్టిన పోలవరం-బనకచర్లతోపాటు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ సీమ్కు పర్యావరణ అనుమతులు తదితర అంశాలను ప్రస్తావించేందుకు కసరత్తు చేస్తున్నది.