Hyderabad | మన్సూరాబాద్, జనవరి 25 : మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ప్రవీణ్కుమార్ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా, కొండపి మండలం, కొయ్యవారిపాలెంకు చెందిన పలెపోగు సిద్దయ్య (44) కూలీ పనులు చేస్తూ కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్లో నివాసముంటున్నాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన సిద్దయ్య పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరించడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఒంగోలు జిల్లా, మర్రిపుడి పీఎస్, కొండపి పీఎస్, కావలి పీఎస్, ఒంగోలు పీఎస్, సింగరాయకొండ పీఎస్, పొదిలి పీఎస్, టంగుటూరు పీఎస్, ఒంగోలు పీఎస్ పరిధిల్లో 15 బైకులను అపహరించిన కేసుల్లో 2020వ సంవత్సరంలో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో అతడిపై నిఘా ఉండటంతో హైదరాబాద్కు మకాం మార్చాడు.
కూలీ పని చేస్తున్నట్లు నటిస్తూ మెట్రో స్టేషన్లలో పార్కు చేసిన బైకులను అపహరించడం మొదలు పెట్టాడు. పాత బైకుల తాళాలు అవలీలగా తీయవచ్చునని గ్రహించి.. ఎక్కువగా పాత బైకులను దొంగిలించడం ఆరంభించాడు. ఎల్బీనగర్ రింగ్రోడ్డు, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో 2023వ సంవత్సరంలో ఐదు బైకులను అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద గురువారం ఉదయం పార్కు చేసిన బైకును దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్పెషల్ టీమ్ పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో 5 బైకులు, ఉప్పల్ పీఎస్ పరిధిలో 5 బైకులు, కూకట్పల్లి పీఎస్ పరిధిలో 3 బైకులు, మియాపూర్ పీఎస్ పరిధిలో 2 బైకులు, కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో 1 బైకు, గుంటూరు పీఎస్ పరిధిలో 1 బైకును అపహరించినట్లు ఒప్పుకున్నాడు. మరో 3 బైకుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి, ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి, డీఐ వీరస్వామి, డీఎస్ఐ నరేందర్ పాల్గొన్నారు.