కుత్బుల్లాపూర్ : డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట అమాయకులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ పద్మజా మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులు బొమ్మిడాం కుమార్, షేక్ సల్మాన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు.
వీరిద్దరి నుంచి రూ. 37 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువ చేసే 30 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5 లక్షల విలువ చేసే ఓ కారు, రూ. 1 లక్ష విలువ చేసే బజాజ్ పల్సర్ బైక్తో పాటు నకిలీ ప్లాట్ పేపర్లు, 3 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 2 స్టాంప్స్, ఒక కలర్ ప్రింటర్, 2 టోకెన్ బుక్స్, 18 నకిలీ పాసు పుస్తకాలు, ఫేక్ ఆధార్ కార్డులు, పాన్కార్డులు, ఫేక్ డిప్యూటీ ఏఈ ఐడీకార్డును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి.. నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఇద్దరు కలిసి సుమారు 100 మందిని మోసం చేశారని పేర్కొన్నారు. ఒక్కొక్కరి వద్ద సుమారు రూ. లక్ష నుంచి రూ. ఆరున్నర లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది బోరబండ, కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరిపై గతంలో 13 కేసులు ఉన్నట్లు డీసీపీ పద్మజా వెల్లడించారు.