Lagacharla | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 8 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై బొంరాస్పేట్ పోలీసులు నమోదు చేసిన కేసులో రెండో నిందితుడిగా ఉన్న బొగమోని సురేశ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ పీడీపీపీ ప్రత్యేక కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50వేల చొప్పున ఇద్దరి పూచీకత్లను కోర్టుకు సమర్పించాలని ఇన్చార్జి ఏసీబీ కోర్టు జడ్జి అఫ్రోజ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమ, శనివారం సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ తాండూర్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి 1 గంటలోపు సంతకం చేయాల్సి ఉంటుందని సూచించారు.
మూడు నెలలపాటు ఎస్డీపీఓ అధికారి ఎదుట విచారణకు సహకరించాలని తెలిపారు. నిందితుడు పాస్పోర్టు కలిగి ఉన్నైట్లెతే కోర్టుకు జమ చేయాలని పేర్కొన్నారు. 50 రోజులపాటు రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో ఉన్న ముద్దాయి తరఫు న్యాయవాది ఏకాంబరం చేసిన వాదనలను ఏకీభవించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు మంగ్యానాయక్, బుగ్గప్పలకు సైతం బెయిల్ మంజూరు చేసింది.
వీరిద్దరూ రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్లను కోర్టుకు జమ చేయాలని, ప్రతి బుధవారం ఎస్డీపీఓ అధికారి తాండూర్ ఎదుట హాజరుకాలని తెలిపింది. ఫార్మాసిటీ కోసం భూములు గుంజుకునేందుకు ప్రభుత్వం.. లగచర్ల రైతులపై వేర్వేరు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. క్రైం.నం.145లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మరో 10మంది రైతులకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ జారీ చేసినప్పటికీ బొంరాస్పేట్ పోలీస్స్టేషన్లో జమానత్లను సమర్పించేందుకు వెళ్లకపోవడం విశేషం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసులోనూ రైతులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.