HomeHyderabadTwin Reservoirs Are Flooded The Gates Are Lifted And 3602 Cusecs Of Water Is Being Released Downstream
నగరానికి ఎల్లో అలర్ట్
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తోనే ఈ ఏడాది నగరంలోని అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా ఉన్నదని, భారీ వర్షాలు కురిసినప్పటికీ నాలాల అభివృద్ధితో అనేక కాలనీల ప్రజలు నిశ్చింతగా ఉన్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
క్షేత్రస్థాయిలో 455 బృందాలు
3602 క్యూసెక్కులు
జంట జలాశయాలకు వరద పోటెత్తున్నది. గేట్లు ఎత్తి దిగువకు 3602 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో గ్రేటర్లో రాగల మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గ్రేటర్కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం గచ్చిబౌలిలో 4.3 సెం.మీల వర్షపాతం నమోదవ్వగా, టోలిచౌకిలో 3.1, అత్తాపూర్లో 3.0, కంటోన్మెంట్లో 2.3 సెం.మీలు చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఎస్ఎన్డీపీతోనే ఈ ఏడాది నగరంలో అనేక ప్రాంతాల్లో ముంపు ముప్పు తప్పింది. నగరంలో 36 నాలాల అభివృద్ధి పనులు చేపట్టగా, 30 పూర్తయ్యాయి. మిగిలిన ఆరు పనులు వేగంగా సాగుతున్నాయి. వానలతో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రేటర్లో 455 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి.
-మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 27 (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తోనే ఈ ఏడాది నగరంలోని అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా ఉన్నదని, భారీ వర్షాలు కురిసినప్పటికీ నాలాల అభివృద్ధితో అనేక కాలనీల ప్రజలు నిశ్చింతగా ఉన్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దూరదృష్టితోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద ముంపు సమస్య తొలగిపోయిందని తెలిపారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డితో కలిసి గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంను సందర్శించారు. కంట్రోల్ రూమ్కు వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. మూడు షిఫ్టుల్లో వివిధ శాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరించారు. వాతావరణ శాఖ అందించే సమాచారం మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ…నగరంలోని నాలాల సమగ్ర అభివృద్ధి కోసం ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద 36 నాలాల అభివృద్ధి పనులు చేపట్టగా, 30 పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఆరు పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. ఎస్ఎన్డీపీ కింద బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపట్టడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులు ఏర్పడలేదన్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అంది స్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అలాగే మీడియా కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంపై అభినందనలు తెలిపారు.
త్వరలో మూసారాంబాగ్ వంతెన నిర్మాణ పనులు..
మూసారాంబాగ్ వంతెన నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తలసాని తెలిపారు. హుస్సేన్సాగర్, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లో ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో 455 టీమ్లు పని చేస్తున్నాయని, డీఆర్ఎఫ్, ట్రాఫిక్, మాన్సూన్, ఎమర్జెన్సీ టీంలు కంట్రోల్ రూం నుంచి వచ్చే ఆదేశాలతో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాయని పేర్కొన్నారు. నీరు నిలిచిపోకుండా, చెట్లు కూలిపోవడం, మ్యాన్హోళ్లు పొంగిపొర్లడం వంటి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. చెత్త తొలగింపు, పారిశుధ్య నిర్వహణ వంటి పనులు, రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని మంత్రి సూచించారు. ప్రజలు అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం (040-2111 1111, 9000 113 667)కు కాల్ చేయాలని కోరారు.
మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు: మేయర్
వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయి సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మూడు షిఫ్టుల్లో 2,111 మంది సిబ్బంది 24 గంటల పాటు పని చేస్తున్నారని అన్నారు. రోడ్లపై భారీగా నీరు నిలిచే ప్రాంతాల్లో సహాయక బృందాలు 1097 పంపుసెట్లను ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోస్తున్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. నగర పరిధిలో 185 చెరువులు ఉండగా ఏడు చెరువులు మత్తడి దూకుతున్నాయని, 35 చెరువులు నిండుకుండల్లా మారాయన్నారు. వర్షాకాలంలో సెల్లార్ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో తీసిన వాటి వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.