సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : రానున్న వేసవి, రబీ పీక్ సీజన్లలో ఏర్పడే అధిక విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వినియోగదారుల శ్రేయస్సుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. గతేడాది దక్షిణ డిస్కం పరిధిలో 9,860 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని, ఈసారి అదే స్థాయిలో డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతేడాది మే నెలలో 3,756 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్తో 7933 కోట్ల యూనిట్ల వినియోగం జరిగిందన్నారు. ఈ ఏడాది సైతం మే నెలలో దాదాపు 4000 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఉండవచ్చని, 8.3-8.5 కోట్ల యూనిట్ల వినియోగం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.