సుల్తాన్ బజార్, జూలై 18: టీఎస్ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారి ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తున్నది. టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ విన్నూత్న కార్యక్రమంలో భాగంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ సర్వీస్ బస్సులను భక్తుల సౌకర్యార్థం తీసుకువచ్చారు. రంగారెడ్డి రీజియన్ నుంచి అరుణాచలం ఆలయానికి, కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ శ్రీ దత్త క్షేత్రానికి, మహారాష్ట్రలోని పండరీపూర్ పాండు రంగస్వామి ఆలయానికి, తుల్జాపూర్లోని తుల్జాభవాని అమ్మవారి ఆలయాలకు భక్తుల సౌకర్యార్థం స్పెషల్ టూర్ ప్యాకేజీ సర్వీస్లో భాగంగా సూపర్ లగ్జరీ సర్వీస్ బస్సులను ఉన్నతాధికారులు ప్రారంభించారు. కాగా, మొట్ట మొదటిసారి ప్రవేశపెట్టిన ఈ ప్యాకేజీలకు భక్తులు, ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది.
ప్రతి నెల పౌర్ణమికి అరుణాచలానికి, అమావాస్యకు గానుగాపూర్ శ్రీదత్త క్షేత్రానికి ఈ టూర్ ప్యాకేజీ సర్వీస్ బస్సులు కొనసాగుతాయని ఆర్టీసీ వర్గాలు తెలుపుతున్నారు. కాగా, పౌర్ణమి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం ఆలయానికి వెళ్ళే భక్తులకు ఒక్కొక్కరికి రూ.3,200 టిక్కెట్ ధర కేటాయించగా, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, వేల్పూరులోని స్వర్ణ దేవాలయాల మీదుగా తిరిగి ఎంజీబీఎస్కు చేరుకుంటుంది. అంతే కాకుండా అమావాస్య సందర్భంగా ఎంజీబీఎస్ నుంచి ప్రారంభమయ్యే కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ శ్రీదత్త క్షేత్రం దత్తాత్రేయ స్వామి ఆలయంతో పాటు మహారాష్ట్రలోని పండరీపూర్ పాండు రంగస్వామి ఆలయం, తుల్జాపూర్లోని తుల్జా భవాని అమ్మ వారి ఆలయాల మీదుగా ఎంజీబీఎస్కు చేరుకుంటుందని, ఈ టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.2,500 టిక్కెట్ ధర కేటాయించడం జరిగిందని అధికారులు వివరించారు.