TSRTC | హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఈ ప్రత్యేక బస్సులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 గంటలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రోజే కాకుండా, ఏప్రిల్ 5వ తేదీన కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
ఇక ఉప్పల్ స్టేడియంకు కోఠి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కొండాపూర్, జేబీఎస్, ఎల్బీ నగర్, బీహెచ్ఈఎల్ నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఇతర వివరాలకు 9959226140/9959224058/ 99592226138 నంబర్లను సంప్రదించొచ్చు. ఏప్రిల్ 5వ తేదీకి కావాల్సిన సమాచారం కోసం 9959226419/ 9959226137/ 9959226147 అనే నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.