సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపడంపై దృష్టి సారించింది. ఈనెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని రంగారెడ్డి రీజయన్ నుంచి దాదాపు 3,500 బస్సులను స్పెషల్గా జిల్లాలకు నడిపించడానికి ఆర్టీసీ అధికారుల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆర్టీసీ రంగారెడ్డి అధికారి నుంచి అనుమతి కోసం సీఎండీ కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. మియాపూర్, కూకట్పల్లి, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, కోఠి వంటి ప్రాంతాల నుంచి దసరా స్పెషల్ బస్సులు నడుపబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక బస్సుల అంశంపై పూర్తి సమాచారం వెలువడనున్నది.
ఎయిర్పోర్టుకు మరో ఆరు పుష్పక్ బస్సులు
శిల్పారామం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరో ఆరు పుష్పక్ ఏసీ బస్సులు ఈనెల 19 నుంచి నడుపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ మేనేజర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ఉదయం 4.30 నుంచి రాత్రి 22.30 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ బస్సులో ప్రయాణించే వారు అప్ అండ్ డౌన్ టిక్కెట్ చార్జీలో 10శాతం రాయితీ కల్పిస్తామన్నారు. టిక్కెట్ ధర రూ.250గా నిర్ణయించామన్నారు.