RTC Buses | హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) రాతపరీక్షను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష కేంద్రాలకు అనుగుణంగా సిటీ బస్సులను ప్రత్యేకంగా నడుపుతామన్నారు. బస్సుల రాకపోకల గురించి అవసరమైన సమాచారం కోసం కోఠిలో 9959226160, సికింద్రాబాద్ రేతిఫైల్లో 9959226154 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
ఈ నెల 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. మాక్టెస్ట్ లింక్ను అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్ చేయాలని ఆమె పేర్కొన్నారు.