ప్రయాణికులు గుర్తించేలా బస్టాండ్లలో సైన్బోర్డులు, రూట్మ్యాపులు
ఆర్టీసీ కంట్రోలర్లకూ కొత్తగా డ్రెస్కోడ్
ఆక్యుపెన్సీ, ఆదాయం పెంచే దిశలో ఆర్టీసీ
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం పెంచేందుకు ఆర్టీసీ తన సేవలను విస్తృతం చేస్తున్నది. అందులో భాగంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన ప్రాంతాల్లో సిటీ బస్సులకు సంబంధించిన రూట్లు, బస్సుల నంబర్లు, ఏ రూట్లో ఏయే బస్సులు ప్రయాణిస్తాయన్న సమాచారాన్ని తెలియజేసే సైన్ బోర్డులను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రధాన ప్రాంతాల్లో బస్సులు ఎక్కే ప్రయాణికులకు ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందన్న సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ అధికారి వెంకన్న తెలిపారు.
కంట్రోలర్లకు డ్రెస్కోడ్..
సికింద్రాబాద్, కాచిగూడ వంటి ప్రధాన ప్రాంతాల్లో బస్సుల నియంత్రణ బాధ్యతలు నిర్వహించే ఆర్టీసీ కంట్రోలర్లకు కొత్తగా డ్రెస్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే వైట్ షర్ట్, వైట్ పాయింట్తో కంట్రోలర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డ్రస్ ప్రయాణికుల మాదిరిగా ఉండటంతో కంట్రోలర్లను గుర్తించడం కష్టంగా మారిందని, కంట్రోలర్ను ప్రయాణికులు గుర్తించే విధంగా పర్పుల్ కలర్ టీషర్ట్, వైట్ పాయింట్ను నిర్ణయించారు. మెడలో ఐడీ కార్డు, తలకు క్యాప్, చేతిలో మైక్తో ప్రయాణికులు తేలికగా గుర్తుపట్టే విధంగా కంట్రోలర్ల డ్రెస్ కోడ్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ, ఆదాయం పెంచుకునే మార్గాలను మెరుగుపరిచేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని రీజియన్ అధికారి తెలిపారు.