సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పథకంతో గ్రేటర్ పరిధిలో సుమారు ఆరున్నర నుంచి ఏడు లక్షల మంది మహిళలు, విద్యార్థినులకు ప్రయోజనం చేకూరనున్నది. సర్కారుపై రోజుకు సుమారు రూ.90 లక్షల వరకు భారం పడనున్నదని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలే కిక్కిరిసిపోయే సిటీ బస్సుల్లో ఈ పథకం అమలు ఎలా ఉంటుంది? తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే దానిపై దృష్టి సారించారు. సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో అమలు చేయనున్న ఈ పథకంలో భాగంగా జీరో టికెట్లు జారీ చేయాల్సిందిగా ఇప్పటికే కండక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
గ్రేటర్ పరిధిలో 2638 ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా, ఇందులో సుమారు 2550 వరకు ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులున్నాయి. మిగిలినవి ఏసీ, పుష్పక్ తదితర బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ నగరంలో రోజుకు 7.68 లక్షల కిలోమీటర్ల మేర 30వేల పైచిలుకు ట్రిప్పుల్లో దాదాపు 18 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. ఇందులో ఆరున్నర నుంచి ఏడు లక్షల వరకు మహిళలు, విద్యార్థినులు ఉంటారు. ఐదు లక్షల వరకు బస్ పాసులు ఉండగా.. అందులో 2.70 లక్షల వరకు విద్యార్థినులకు సంబంధించిన పాస్లు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఆర్టీసీకి రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. కోటిన్నర వరకు డీజిల్కు ఖర్చు చేస్తున్నారు. కాగా, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు, విద్యార్థినులకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని గ్రేటర్లోని 29 డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పథకం అమలులో భాగంగా లోటుపాట్లు, సాధక బాధకాలు తెలిసే అవకాశం ఉన్నందున… కొన్నిరోజుల తర్వాత అమలు ఎలా ఉందనే దానిపై స్పష్టత వస్తుందని, తదనంతరం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రణాళిక రూపొందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల ప్రైవేటు, సొంత వాహనాలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేసే మహిళలు కూడా ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సంఖ్యతో పోల్చితే.. 10 నుంచి 20 శాతం వరకు మహిళా ప్రయాణికులు పెరగవచ్చని గ్రేటర్ ఆర్టీసీ జోన్ అధికారులు అంచనా వేస్తున్నారు.