సిటీబ్యూరో, మారేడ్పల్లి, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సుల వల్ల కలిగే లాభాలు, ప్రైవేటు వాహనాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు 12మందితో కూడిన కళాబృందాన్ని రంగంలోకి దింపారు. కాళ్లకు గజ్జలు కట్టిన కళాబృందం ప్రజలను, ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల (జీహెచ్ఎంసీ జోన్) పరిధిలో సిటీ బస్సులకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ఆక్యుపెన్సీని 75 శాతానికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జేబీఎస్లో కళాబృందం ప్రచార రథాన్ని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. దాదాపు మూడు నెలలకు పైగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో కళాబృందాలు వేర్వేరుగా ప్రదర్శనలు చేయనున్నారు.
రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులతో గతంలో ఉన్న బస్స్టాప్లు కనుమరుగయ్యాయని, వాటిని పునరుద్ధరించే ప్రయత్నాలు మొదలు పెట్టామని ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో 2400 బస్ స్టాపుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 1400 బస్స్టాపులు రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని బస్స్టాపులను జీహెచ్ఎంసీ అధికారులు ఆధునీకరిస్తున్నారని తెలిపారు. మెట్రో స్టేషన్లకు అనుబంధంగా కొన్ని బస్ స్టాపులు ఉండగా.. లేని ప్రాంతాల్లో బస్సులు ఆగడానికి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తామన్నారు.
విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా కొత్తగా బస్ రూట్లను సైతం పెంచనున్నట్లు తెలిపారు. కూకట్పల్లి నుంచి చౌటుప్పల్, ఈసీఐఎల్ నుంచి మేడ్చల్ వరకు సిటీ బస్సుల సర్వీసులను పొడిగించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 3089 బస్సులు తిరగాల్సి ఉండగా ప్రస్తుతం 2884 ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయన్నారు.
లాక్డౌన్ సడలించిన తర్వాత ఇప్పుడిప్పుడే సిటీ బస్సుల ద్వారా రోజుకు రూ.2.50 కోట్ల వరకు రాబడి వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో రూ.3.50 కోట్లకు చేరుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోన్కు చెందిన ప్రాంతీయ మేనేజర్లు యుగంధర్, వెంకన్న, డిప్యూటీ చీఫ్ ట్రాక్ మేనేజర్ జానికిరామ్ తదితరులు పాల్గొన్నారు.