ఎన్నో సంస్కరణలు తెచ్చి.. మరెన్నో ప్రస్థానాలను నెలకొల్పింది. ఎన్నెన్నో విజయాలు నమోదు చేసి ఎందరెందరో జీవితాల్లో వెలుగులు నింపింది. పకడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించి.. జాప్యం లేకుండా ఫలితాలు ప్రకటించి దేశానికే పాఠాలు నేర్పింది మన టీఎస్పీఎస్సీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చేపట్టిన నియామకాల్లో ఎక్కడా లోటుపాట్లకు తావు ఇవ్వకుండా పారదర్శకతను పాటించింది. ఏ చిన్న తప్పు దొర్లకుండా చాకచక్యంగా వ్యవహరించి ఉద్యోగార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపింది.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమించి దశాబ్దాల చిరకాల వాంఛను సాధించుకున్నాం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దుసుకెళ్తున్నది. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో టీఎస్పీఎస్సీ అతి తక్కువ సమయంలో తక్కువ సిబ్బందితో టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసి మన్ననలు పొందింది. దేశ వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ పనితీరుపై అభినందనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అలాగే గతంలో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీపై ఆరోపణలు రావడం సరైంది కాదని, ఈ కమిషన్ ద్వారా కొలువులు సాధించిన ఉద్యోగుల అనుభవాలు వారి మాటల్లోనే..
మేడ్చల్, మార్చి19(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ శాఖల్లోని ఖాళీలను పైరవీలకు ఆస్కారం లేకుండా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసింది. 2015 సంవత్సరంలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ పరీక్షల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన మద్ది సాయినాథ్ ఏడబ్ల్యూఈలో ఉద్యోగం సాధించి ప్రస్తుతం మిషన్ భగీరథలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణపై మద్ది సాయినాథ్ ప్రత్యేక ఇంటర్వ్యూ.
ప్రశ్న: టీఎస్పీఎస్సీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యారు.
సాయినాథ్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాను. సొంతంగా ఇంటి వద్ద ప్రిపేర్ అవుతూ ప్రభుత్వ లైబ్రరీ పుస్తకాలను వినియోగించుకున్నాను. రోజు 10 గంటలు చదివి ఉద్యోగం సాధించా.
ప్రశ్న: ఉద్యోగం ఎలా సాధించారు.
సాయినాథ్: ఉద్యోగ ప్రక్రియలో ప్రభుత్వం ఎలాంటి పైరవీలకు తావు ఇవ్వలేదు. పూర్తిగా పారదర్శకంగా జరిగింది. కష్టపడి చదివిన వారికి ఉద్యోగం వచ్చింది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగానే ఇంటర్వ్యూకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాను. ఇంటికే కాల్ లెటర్ను పంపించారు. ఎలాంటి పైరవీలు లేకుండా అర్హులైన వారినే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇంత పారదర్శకంగా జరుగుతుందని ఊహించలేదు. టాలెంట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది.
ప్రశ్న: పోస్టింగ్ ప్రక్రియ ఎలా జరిగింది ?
సాయినాథ్: ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్హహణ నుంచి పరీక్షలు పూర్తయి ఇంటర్వ్యూల వరకు పారదర్శకంగా జరిగినట్లుగానే పోస్టింగ్ ప్రక్రియ జరిగింది. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థులకు పూర్తి నమ్మకం ఏర్పడింది.
పట్టుదలతో చదివి ఉద్యోగాలు కొట్టాలి. అంతేగానీ నియామక సంస్థలపై వచ్చే ఆరోపణలు పట్టించుకోవడం మానేస్తే మంచిది. మాది జగిత్యాల. గ్రూప్-4 లక్ష్యంగా కరీంనగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో 2018లో చేరిన. దాదాపు మూడున్నర నెలలు అక్కడ శిక్షణ తీసుకున్నా. అప్పుడు ఉద్యోగం రాకపోయినా పోటీ పరీక్షలపై అవగాహన పెరిగింది. ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్నా. వివాద అంశాలు పట్టించుకోకుండా గ్రూప్-2 సాధనే లక్ష్యంగా సాగుతున్నా.
– మొగిలిపాక నవ్యశ్రీ, పంచాయతీ సెక్రటరీ, జగిత్యాల జిల్లా
కష్టపడి చదివించిన మా కొడుకు సాయినాథ్ ఉన్నతమైన ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉంది. కొడుక్కి ఉద్యోగం రావడం రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ వల్లే సాధ్యమైంది. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసారు. చదువుకునే వారందరికి కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన నమ్మకం ఏర్పడింది.
-మద్ది సాయినాథ్ తల్లిదండ్రులు-ఆగమయ్య-భాగ్యవతి
జాబ్ కొట్టాలనే పట్టుదల ఉంటే.. బయట జరిగే విషయాలను పట్టించుకోవడం మానేయడం చాలా మంచిది. మాది జగిత్యాల జిల్లా స్వస్థలం. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న. సాధించాలనే ఆలోచన ఉండే కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలనే విషయాలపై అవగాహన లేకుండేది. కానీ ఉద్యోగం కొట్టాలనే కుటుంబ ప్రోత్సాహంతో వచ్చిన. అయినా కూడా ఇక్కడితో ఆగిపోలేదు. ఉద్యోగం చేస్తూనే సొంతంగా మెటీరియల్ సమకూర్చుకుని చదువుతున్న. గ్రూప్ – 2 సాధించడమే లక్ష్యం.
-మొగిలిపాక నవ్యశ్రీ, పంచాయతీ సెక్రటరీ, గ్రూప్-2 అభ్యర్థి, జగిత్యాల జిల్లా
సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత 2007లో హైదరాబాద్కు చేరాను. అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రతి నోటిఫికేషన్కు దరఖాస్తు చేయడం, జాబ్ కొట్టాలనే పట్టుదలతో ఏళ్ల తరబడి పరీక్షకు సిద్ధమయ్యేవాడిని. కానీ రాసిన ప్రతి పరీక్షకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన సందర్భాలే ఉన్నాయి. అలా ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్న క్రమంలో..ఏదైనా ఉద్యోగం తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదనే మనస్థాపంతో అవన్నీ పక్కనపెట్టి ఐటీ ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి ఐదారేళ్ల పాటు పనిచేసి ఆరు అంకెల జీతానికి చేరి స్థిరపడిన తర్వాత మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశ కలిగింది. చివరి ప్రయత్నంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన టీచర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఐటీ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ ప్రిపేర్ అయితే 1:2 నిష్పత్తిలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక చేసేదేమి లేక, ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ వెంటనే విడుదలైన తొలి పంచాయతీ రాజ్ సెక్రటరీ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఉద్యోగం చిన్నదే అయినా, ప్రభుత్వం ఉద్యోగం కొట్టాలనే తపన మాత్రం ఉంది. టీచర్ జాబ్ రాలేదన్న బాధ ఈ ఉద్యోగంపై కసిని పెంచింది. సరిగ్గా 45రోజుల శ్రమకు తగిన ఫలితం దొరికింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల 2019లో నెరవేరింది. అయితే ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్ల విషయంలో అభ్యర్థులు ఒకటే గుర్తు పెట్టుకోవాలి. నాకు ఫలానా జాబే కావాలనుకోవడం వేరు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకోవడం వేరు. ఇలాంటి సందర్భంలో వచ్చిన నోటిఫికేషన్ కంటే..ప్రిపరేషన్ కోసం చేసే హార్డ్ వర్క్తోనే ఫలితాలు వస్తాయిని గుర్తు పెట్టుకోవాలి.
-పెండెం వేణుగోపాల్, పంచాయతీ సెక్రటరీ, జగిత్యాల జిల్లా
సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా కష్టమైందే. అలా అని అసాధ్యమైతే కాదు. ఎన్నో అవరోధాలు, హేళనలను ఎదుర్కొంటే గానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. ఇబ్బందులను చూసి వెనకడుగు వేయొద్దు. ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో వచ్చే పుకార్లకు ఏమాత్రం భయపడొద్దు. అవన్నీ కూడా మనసులోకి రాకుండా ప్రిపరేషన్ మీద దృష్టి సారించాలి. అనవసరమైన విషయాలను పట్టించుకుని ప్రిపరేషన్ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఎన్నో అనుభవాలకు నిలబడి ఇప్పుడు టీజీటీ టీచర్ ఉద్యోగాన్ని సాధించగలిగాను. ప్రైవేటు టీచర్ ఉద్యోగం చేస్తూనే సాయంత్రం తర్వాత సమయాన్ని సొంతంగా ప్రిపేర్ అయ్యేలా ప్లాన్ చేసుకున్న.. అలా టీజీటీ, పీజీటీ నోటిఫికేషన్ రావడంతో 2017లో తొలిసారిగా బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ పొందాను. రెండో దఫా కోచింగ్ కోసమని హైదరాబాద్లో శిక్షణ పొందడటంతో సబ్జెక్ట్పై పట్టు రావడంతో ఉద్యోగం సాధిస్తానని పట్టుదల పెరిగింది. 2018లో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి కరీంనగర్లోని జ్యోతి బాపూలే గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో టీజీటీ ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్నాను. ఉన్నత స్థాయికి చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలపై దృష్టి పెడితే.. అనుకున్న లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేమనే విషయాన్ని పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
– పెనుకొండ మహాలక్ష్మి, టీజీటీ టీచర్, కరీంనగర్…
2012లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఏమీ తోచని పరిస్థితుల్లో పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకున్న. అలా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలతో గడిపేవాడిని. గంగాధర మండలం కొండెన పల్లి గ్రామం సొంతూరే అయినా..చదువు కోసమని ఎక్కువగా కరీంనగర్లోనే ఉండేవాడిని. నాలుగేళ్లు గడిచిన తర్వాత వచ్చిన పోలీసు నోటిఫికేషన్లో ఏఆర్ కానిస్టేబుల్కు ఎంపికై, 9నెలల శిక్షణ, 5నెలల సర్వీసు చేసిన తర్వాత 2017లో మరోసారి ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. అప్పుడు కూడా జాబ్లు ఇప్పిస్తాం, అది చేస్తామనే మాటలు వినిపిస్తుండే. కానీ చదివితేనే జాబ్ వస్తుందని నమ్మి ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ కొట్టిన. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగానే.. ప్రిపరేషన్పై దృష్టి పెట్టి..మంచి స్కోర్తో ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టి పెద్దపల్లిలో తొలిసారిగా విధులు నిర్వహించిన. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలో పనిచేస్తూనే వీలు దొరికిన ప్రతిసారి సమయం వృథా చేయకుండా గ్రూప్-2 కోసం సన్నద్ధం అవుతున్న.
– అనంతగిరి కిరణ్, ఎక్సైజ్ కానిస్టేబుల్, గంగాధర మండలం
తాను ఎంతో కష్టపడి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తదా అని ఎదురుచూశాం. 2015 సెప్టెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవడం జరిగింది.2015 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణుడిని అయ్యాను. కాగా 2016లో ఉద్యోగం పొంది జీహెచ్ఎంసీలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిర్వహించిన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ మొదలుకొని ఉద్యోగం వరకు కమిషన్ ఎంతో పారదర్శకంగా నిర్వహించి తమకు ఉపాధిని కల్పించడం అభినందనీయం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబద్ధత, పారదర్శకతకు ఇదే నిదర్శనం.
-వెంకటేశ్, ఏఈ, జీహెచ్ఎంసీ
ముషీరాబాద్, మార్చి 19 : తెలంగాణ వచ్చిన తరువాత ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు అవకాశాలు పెరిగినయ్. తెలంగాణ వచ్చిన తొలిరోజుల్లో వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా పోలీసు డిపార్టుమెంట్లో ఉద్యోగం సంపాదించా. మూడు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకొని, రోజుకు 7 నుంచి 8 గంటల పాటు చదివి ఉద్యోగం సాధించాను. ఉద్యోగ నియామకాల్లో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా నియామక ప్రక్రియ చేపట్టారు.
-జీ సాయినాథ్, కానిస్టేబుల్, ఏఆర్ డిపార్టుమెంట్, హైదరాబాద్
సుల్తాన్బజార్, మార్చి 19 : గతంలో తాము పరీక్షలను ప్రిపేర్ అయ్యే సమయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎటువంటి సమస్యలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2015 సెప్టెంబర్లో నోటిఫికేషన్ రాగా దరఖాస్తు చేసుకున్నాం. అదే యేడాది డిసెంబర్లో పరీక్షలను రాయడం జరిగింది. 2016లో ఆర్ అండ్ బీలో అసిస్టెంట్ ఇంజినీర్గా ఉద్యోగం వచ్చింది. నాడు తాను ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో తమకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షలను ఎంతో పారదర్శకంగా నిర్వహించింది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎంతో మంది ఆశతో ఉన్నారు.
-స్వప్నిల్, అసిస్టెంట్ ఇంజినీర్