బన్సీలాల్పేట్ : సర్కారు దవాఖానాలలో నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ డాక్టర్ ఎరోళ్ళ శ్రీనివాస్ అన్నారు.
సోమవారం సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను ఆయన గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, ఆర్ఎంఓ 1 డాక్టర్ జయకృష్ణ, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈ శరత్చంద్రా రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేశారు.
దవాఖానలోని బయటి రోగుల విభాగం, సెల్లార్లోని రేడియాలజీ సీటి స్కాన్, ఎమ్మారై విభాగాలను, కార్డీయాలజీ విభాగంలో క్యాత్ల్యాబ్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో రోజువారి మందులను ఎలా అందిస్తున్నారో తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.
దవాఖానలో మందుల కొరత లేకుండా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు ఏరోజుకారోజు ఇండేంట్ పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. సెంట్రల్ ల్యాబోరెటరీలో రోగుల రక్త నమూనాల సేకరణ, వ్యాధి నిర్థారణ పరీక్షలను పరిశీలించారు. ఓపీ భవనం వెనక వైపు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) భవన నిర్మాణ పనులను పరిశీలించారు.