హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం (Vijayanagaram) నుంచి మహారాష్ట్రకు (Maharashtra) లారీలో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందుల నుంచి 208 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రణాళిక ప్రకారం పోలీసులతో కలిసి టీఎస్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (TS-NAB) అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారని టీఎస్ న్యాబ్ ఎస్పీ సునీతా రెడ్డి చెప్పారు. నిందితులు విజయనగరం నుంచి జడ్చర్ల మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. పట్టుబడిన గంజాయి రూ.కోటి విలువ ఉంటుందన్నారు.
గంజాయి తరలించే లారీకి 30 కిలోమీటర్ల ముందు కారు వెళ్తూ ఉంటుందని, ఎక్కడైనా పోలీస్ చెకింగ్ ఉందా? లేదా? అని చెక్ చేస్తూ ఉంటారని తెలిపారు. నిందులంతా మహారాష్ట్రకు చెందినవారని, ప్రధాన నిందితుడు హసన్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. నిందితులు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో (AOB) 50 వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారని చెప్పారు.