హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన ఆక్రమణలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండానే అపార్ట్మెంట్లు, లేఅవుట్లు వెలసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది.
అయితే వీటికి గతంలో పంచాయతీలు అనుమతులు ఇచ్చినట్లు చెప్తున్నారని అధికారులు తెలియజేశారు. గతంలో పంజాయతీలకు రెండతస్తుల వరకే హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది.
రెండతస్తుల వరకే అనుమతులు ఉన్నాయని.. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు లేవని స్పష్టంచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని నిర్మాణాలను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది.
అదే సమయంలో అనుమతులు లేని నిర్మాణాలు కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆక్రమణలపై తీసుకున్న చర్యల నివేదికను ఈ నెలాఖరులోపు సమర్పించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించింది.