ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 7: అధ్యాపకులు కూడా నిత్య విద్యార్థులేనని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. నిత్యం నేర్చుకుంటూ ఉండాల్సిందేనని, అప్పుడే అప్డేట్గా ఉంటారని చెప్పారు. యూనివర్సిటీలలో వివిధ విభాగాల మధ్య సఖ్యత, మంచి సంబంధాలు ఉండాలని సూచించారు. అప్పుడే సరికొత్త అధ్యయనాలు, ఆలోచనలు పుట్టుకొస్తాయని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘ల్యాబ్ టు ప్రొడక్ట్: ఎనేబ్లింగ్ యూనివర్సిటీస్ టు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ హబ్స్’అనే అంశంపై అధ్యాపకులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ బీజే రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలోచనలు ఎప్పుడూ స్వేచ్ఛాయుత వాతావరణంలోనే పుట్టుకొస్తాయన్నారు. అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు అందరూ నిర్మితమై ఉన్న పద్ధతులను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, డెవలప్మెంట్ అండ్ యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
సామాజిక స్పృహను పెంపొందించుకోవాలి
విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహను పెంపొందించుకోవాలని నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా డాక్టర్ బాబూ జగజ్జీవన్రామ్ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని ఈ క్లాస్రూమ్లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రొఫెసర్ శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల అవగాహనతో ఉండాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గణేశ్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు పాల్గొన్నారు.