ప్రధాని మోదీ నగర పర్యటనను నిరసిస్తూ గురువారం ఉస్మానియా వర్సిటీ పోలీస్స్టేషన్లో టీఆర్ఎస్వీ నాయకులు ఇలా నినాదాలు చేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలపై నిలదీసే ప్రమాదముందని వీళ్లను పోలీసులు ముందే కస్టడీలోకి తీసుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మే 26: ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని భావించిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ముందస్తుగా టీఆర్ఎస్వీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా తాత్సారం చేయడంతో పాటు రాష్ర్టానికి కనీసం ఒక మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. ఇతర ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించకుండా బడ్జెట్లో రాష్ర్టానికి మొండి చేయి చూపించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఫెలోషిప్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత శ్రీకుమార్, రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, నాయకులు సందీప్లు ఉన్నారు.