హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 20 ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంపొందించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందని, వివిధ పదవులలో అవకాశం కల్పించి తగిన గౌరవాన్ని కల్పిస్తుందన్నారు. టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించడంతో బీజేపీలో భయాందోళన మొదలైందని, అందుకోసమే అనేక రకాల కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నాం కదా అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వద్ద ఉన్న వ్యవస్థలతో భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
అన్ని నియోజకవర్గాలలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని, తిరిగి అధికారంలోకి వస్తామని అన్నారు. తాము ఏం చేశామో ప్రజలకు చెప్పగలమని, మీరేం చేశారో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణి దేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, నాయకులు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, పలు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంచార్జిలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.