టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు స్పష్టం
44వ జాతీయ రహదారిపై నిరసన
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 6 : కేంద్రం వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని, వడ్లు కొనే వరకు పట్టువిడవబోమని, కొనేవరకు ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్లో 44వ జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. తొలుత మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న నేతలు, ప్రజాప్రతినిధులు ర్యాలీగా జాతీయ రహదారిపైకి వచ్చి, వివేకానంద విగ్రహం వద్దకు చేరుకున్నారు. రెండు వైపులా రోడ్డుపై బైఠాయించి, ట్రాఫిక్ను స్తంభింప చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష మానుకోవాలని, తెలంగాణ ద్రోహి బీజేపీ అని ఆరోపించారు. రైతు మెడమీద బీజేపీ కత్తి, రైతుల పక్షాన నిరంతరం పోరాడుదాం, రైతు సంక్షేమమే మా ధర్మం, రైతే మా మతం.. అని ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ డౌన్ డౌన్, యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనాల్సిందేనని నినాదాలు చేశారు. నిరసన సమయంలో అంబులెన్స్లు వచ్చాయి. వాటికి దారి ఇచ్చి పంపించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు టీఆర్ఎస్ నాయకుల ఉద్యమ స్ఫూర్తిని ప్రశంసించారు. ధర్నా సందర్భంగా మహేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి తదితరులు మాట్లాడారు.
జాతీయ రహదారిపై రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమించాలని కోరారు. వినకపోవడంతో సీఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుంచి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ నిరసనలో జడ్పీటీసీలు శైలజా విజయానందారెడ్డి, అనితాలాలయ్య, ఎంపీపీ ఎల్లూబాయి, వైఎస్ ఎంపీపీ గోపని వెంకటేశ్, మున్సిపాలిటీల చైర్పర్సన్లు పావనీ జంగయ్య యాదవ్, రాజేశ్వర్రావు, కౌకుంట్ల చంద్రారెడ్డి, ప్రణీత, వైస్ చైర్మన్లు చీర్ల రమేశ్, మల్లేశ్, నరేందర్రెడ్డి, పీఏసీఎస్ల చైర్మన్లు సురేశ్ రెడ్డి, రణదీప్రెడ్డి, సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మేడ్చల్, శామీర్పేట, మూడుచింతపల్లి మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, సుదర్శన్, మల్లేశ్ గౌడ్, పట్టణ అధ్యక్షులు శేఖర్ గౌడ్, శ్రీధర్, తిరుపతిరెడ్డి, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, జగన్రెడ్డి, రామస్వామి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, శైలజాహరినాథ్, వివిధ మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వడ్లను కొనేవరకు ఆందోళన..
ఘట్కేసర్, ఏప్రిల్ 6: తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల తరఫున ఆందోళన నిర్వహిస్తామని ఘట్కేసర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మేడ్చల్లోని హైవే పై నిర్వహించిన ధర్నాలో చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.