రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ ఆందోళనలు
నేటి నుంచి వివిధ పంథాల్లో ఉద్యమం
తొలిరోజు మండల కేంద్రాల్లో దీక్షలు
కేంద్రంతో అమీతుమీ తేల్చేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం
మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు
టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు
మేడ్చల్, ఏప్రిల్ 3, ఇబ్రహీంపట్నం: వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రత్యక్ష పోరాటానికి జిల్లా ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పండే వడ్లను కేంద్రం కొనే వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమం కొనసాగించేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎమ్మెల్యేలతో పాటు మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడి భారీగా నిరసనలు చేపట్టాలని కోరారు.
మేడ్చల్ జిల్లాలో భారీ నిరసన కార్యక్రమాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శనలు చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సోమవారం మేడ్చల్, శామీర్పేట, మూడు చింతలపల్లి, ఘట్కేసర్, కీసర మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఈ దీక్షల్లో రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ నెల 6న ప్రధాన రహదారులపై రాస్తారోకోలు.. 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు.. 8న గ్రామ పంచాయతీల్లో దిష్టిబొమ్మల దహనం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతుల ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలియజేయనున్నారు.
కేంద్రంతో పోరు ఆగదు : మంత్రి మల్లారెడ్డి
యాసంగిలో రైతులు పండించిన వడ్లు కొనేవరకు కేంద్రంపై పోరాటం చేస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నుంచి జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ పోరు ఆగదన్నారు. అన్నం పెట్టే రైతన్నను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రపథంలో దూసుకుపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక అనేక అడ్డంకులు సృష్టిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు.