మన్సూరాబాద్, జనవరి 13: బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీనగర్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ను ఘనంగా జరుపుకొన్నారు. ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దేవిరెడ్డి కమలాసుధీర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోగి మంటలు, ముగ్గుల పోటీలు, ముచ్చట గొలుపు గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలు, పతంగుల రెపరెపలతో నిర్వహించిన సంక్రాంతి సంబురాల సందడి ఆహుతులను ఎంతగానో ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను మహిళలు ముగ్గుల రూపంలో ప్రదర్శించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి దంపతులు ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్లో ఉత్సాహం పాల్గొన్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సతీమణి జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ పతంగులను ఎగురవేస్తూ, పిండి వంటలు చేస్తూ మహిళలను ప్రోత్సహించారు.
మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన మహిళలు
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి, దేశ ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియజేస్తూ మహిళలు సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన ముగ్గులు ఆహుతులను ఆలోచింపజేశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్యుల జీవిత చిత్రాలు ఎలా మారిపోయాయో ప్రతిబింబించేలా మహిళలు ముగ్గులు వేశారు. మోదీ హఠావో.. దేశ్ బచోవో, రూపాయి విలువ పడగొట్టింది మోదీ, చప్పన్ ఇంచ్ కా మోదీ కిత్నా గిరాప్, మోదీ నీ పాలనలో మేము సంతోషంగా లేము, బీజేపీ ప్రభుత్వం రాక ముందు.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన అనంతరం దేశవ్యాప్తంగా డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరిగాయో చూపే రూపంలో మహిళలు ముగ్గులు వేసి కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల వినూత్నంగా నిరసన వ్యక్తం చేసి ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, రమావత్ పద్మానాయక్, కర్మన్ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, నాగోల్ డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీల, మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీశ్యాదవ్, కొసనం వెంకట్రెడ్డి, నాయకులు రంగేశ్వరి, అనిత, భాస్కర్యాదవ్, ఏలుకొండ రాంకోటి, నగేశ్, తదితరులు పాల్గొన్నారు.